నేపాల్ ప్రధాని బాలెన్ షాతో ఫోన్లో మాట్లాడిన ప్రధాని మోదీ
ABN , Publish Date - Aug 26 , 2026 | 05:54 PM
భారత ప్రధాని నరేంద్ర మోదీ.. నేపాల్ ప్రధాని బాలెన్ షాతో బుధవారం ఫోన్లో మాట్లాడారు. మెరుపు వరదల కారణంగా జనం ప్రాణాలు కోల్పోవటంపై ప్రధాని మోదీ సంతాపం తెలిపారు.
ఇంటర్నెట్ డెస్క్: భారత ప్రధాని నరేంద్ర మోదీ.. నేపాల్ ప్రధాని బాలెన్ షాతో బుధవారం ఫోన్లో మాట్లాడారు. మెరుపు వరదల కారణంగా జనం ప్రాణాలు కోల్పోవటంపై ప్రధాని మోదీ సంతాపం తెలిపారు. వరద పరిస్థితులపై ఆరా తీశారు. అన్నిరకాల సహాయ సహకారాలు అందిస్తామని మోదీ భరోసా ఇచ్చారు. ఈ మేరకు ప్రధాని మోదీ తన ఎక్స్ ఖాతాలో బుధవారం ఓ పోస్టు పెట్టారు.
ఆ పోస్టులో.. ‘ప్రధాన మంత్రి బాలేంద్ర షాతో మాట్లాడాను. నేపాల్లో సంభవించిన వరదల కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం తెలియజేశాను. ఈ కష్టసమయంలో నేపాల్లోని సోదర సోదరీమణులకు భారతదేశ ప్రజలు అండగా ఉంటారు. నేపాల్కు సాధ్యమైనంత వరకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించడానికి భారతదేశం సిద్ధంగా ఉంది. సహాయక, రక్షణ చర్యలపై మా బృందాలు పరస్పరం సమన్వయంతో పనిచేస్తున్నాయి’ అని పేర్కొన్నారు.
105 మంది భారతీయుల గల్లంతు..
ఉద్ధృతంగా ప్రవహించిన భోటేకోశీ నది నువాకోట్, ధాడింగ్ జిల్లాల్లో బీభత్సం సృష్టించింది. టిబెట్ వైపు నుంచి వచ్చిన మెరుపు వరదల కారణంగా పలు ఊళ్లు, బ్రిడ్జ్లు, ప్రాజెక్ట్లు నీటిలో కొట్టుకుపోయాయి. వరద బీభత్సం కారణంగా బుధవారం ఉదయం రసువా జిల్లాలో 1000 మంది నీటిలో కొట్టుకుపోయారని అధికారులు అంచనా వేస్తున్నారు. వరదలో కొట్టుకుపోయిన వారిలో 105 మంది భారతీయులు ఉన్నట్లు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి
ఇతరులకు నీతులు చెప్పే ముందు చరిత్ర చూసుకోవాలి జగన్: : మంత్రి సత్యకుమార్ యాదవ్
నేపాల్లో ఆకస్మిక వరదలు.. అసలు ఏం జరిగింది?