Share News

సహాయక చర్యలకు వనరుల కొరత

ABN , Publish Date - Sep 01 , 2026 | 06:20 AM

నేపాల్‌ జల విలయంలో కనిపించకుండాపోయినవారు సురక్షితంగా బయటపడతారన్న ఆశలు సన్నగిల్లుతున్నాయి. నేపాల్‌ సైన్యం, పోలీసులు, పారామిలిటరీ దళాలు రాత్రింబవళ్లు..

సహాయక చర్యలకు వనరుల కొరత

  • నేపాల్‌లో నెమ్మదిగా రెస్క్యూ ఆపరేషన్‌

  • 903కు చేరిన మృతుల సంఖ్య.. 4వేల మందికి పైగా మిస్సింగ్‌

కాఠ్మాండు/ నార్సింగ్‌, ఆగస్టు 31: నేపాల్‌ జల విలయంలో కనిపించకుండాపోయినవారు సురక్షితంగా బయటపడతారన్న ఆశలు సన్నగిల్లుతున్నాయి. నేపాల్‌ సైన్యం, పోలీసులు, పారామిలిటరీ దళాలు రాత్రింబవళ్లు సహాయక చర్యల్లో శ్రమిస్తున్నా.. వనరుల కొరతతో పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఆధారం కోసం పట్టుకొనేందుకు తమవద్ద కనీసం తాళ్లు కూడా సరిపడినన్ని లేవని ఓ పోలీస్‌ అధికారి సోమవారం ఆవేదన వ్యక్తం చేశారు. మీటర్ల మందం పేరుకుపోయిన మట్టికింద మనుషుల కోసం వెదికేందుకు అత్యాధునిక థర్మల్‌ కెమెరాలు, శబ్దాలను పసిగట్టే సోనార్‌ పరికరాలు లేకపోవటంతో పారలు, చేతులతోనే మట్టిని తవ్వుతున్నారు. మట్టికింది నుంచి బయటపడిన మృతదేహాలను భద్రపరిచేందుకు బాడీ బ్యాగులు కూడా లేవని ఓ అధికారి తెలిపారు. ఆగస్టు 26న సంభవించిన ఈ ప్రకృతి విపత్తులో మృతుల సంఖ్య సోమవారం నాటికి 903కు చేరింది. 4వేల మందికిపైగా గల్లంతయ్యారు. త్రిశూలీ, భోటెకోశీ నదులపై నిర్మాణంలో ఉన్న జలవిద్యుత్‌ ప్రాజెక్టుల సొరంగాల్లోనే 933 మంది గల్లంతయ్యారు. వారిలో ఎవరైనా బ్రతికి ఉన్నారేమోనన్న ఆశతో సహాయక చర్యలను కొనసాగిస్తున్నారు.

హైదరాబాద్‌ వాసి గల్లంతు!

నేపాల్‌ వరదల్లో హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి గల్లంతయ్యారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మణికొండకు చెందిన రాళ్లగూడెం ధన్‌పాల్‌రెడ్డి ముంబైకి చెందిన పర్వతారోహకుడు డాక్టర్‌ చితాలే బృందంతో కలిసి నేపాల్‌లో ట్రెక్కింగ్‌కు వెళ్లాడు. కాఠ్మాండులోని శంకర్‌ హోటల్‌లో బసచేసిన ఆయన.. ఆగస్టు 26న ట్రెక్కింగ్‌ కోసం బయల్దేరాడు. అప్పటి నుంచి ఽవారి ఫోన్లు స్విచాఫ్‌ అని వస్తున్నాయి. వారంతా నేపాల్‌ వరదల్లో గల్లంతయ్యారేమో అని ధన్‌పాల్‌ కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.

ఇవి కూడా చదవండి..

ఇరాన్‌లో లక్ష మందికి పైగా నిరసనకారుల హత్య: ట్రంప్ సంచలన ఆరోపణలు..

భారత్, బంగ్లాదేశ్ సిరీస్‪పై బీసీబీ చీఫ్ కీలక అప్‌డేట్!

ఇందిరమ్మ ఇళ్లు ఉన్న గ్రామాల్లోనే మేము ఓట్లు అడుగుతాం: మంత్రి పొంగులేటి

Updated Date - Sep 01 , 2026 | 06:20 AM