సృష్టి ఉన్నంతవరకూ ధర్మం ఉంటుంది.. సమస్త సంతోషానికీ అదే మూలం: మోహన్ భాగవత్
ABN , Publish Date - Sep 18 , 2026 | 03:18 PM
ధర్మం అనేది కేవలం వృద్ధాప్యానికి మాత్రమే పరిమితమైనది కాదని, మనిషి జీవితం ప్రారంభం నుంచి అంతం వరకూ తోడుండేదని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) సర్ సంఘచాలక్ మోహన్ భాగవత్ స్పష్టం చేశారు.
ఉజ్జయిని (మధ్యప్రదేశ్), సెప్టెంబర్ 18: 'ధర్మం' అనేది కేవలం వృద్ధాప్యానికి మాత్రమే పరిమితమైనది కాదని, మనిషి జీవితం ప్రారంభం నుంచి అంతం వరకూ తోడుగా ఉండేదని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) సర్ సంఘచాలక్ మోహన్ భాగవత్ స్పష్టం చేశారు. మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో ఇవాళ (శుక్రవారం) నిర్వహించిన 'యువ ధర్మ సంసద్' కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు.
సాధారణంగా ధర్మం గురించి వృద్ధులే మాట్లాడతారనే భావన ఉన్న నేటి రోజుల్లో, యువత 'ధర్మం' గురించి ఆలోచించడం, చర్చించడం తనకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని ఆయన అన్నారు. గీత, రామాయణాలను రిటైర్ అయిన తర్వాతే చదవాలనే అపోహ సమాజంలో ఉందని, కానీ అది ఎంతమాత్రం నిజం కాదని భాగవత్ చెప్పారు. ధర్మం ఆధారంగానే విశ్వం నడుస్తుందని పేర్కొన్నారు.
'ప్రతిదీ నా నియాంత్రణలోనే ఉంది, నా ప్రకారమే జరగాలి' అనే అహంకారంతో నడుచుకునే వ్యక్తి తీవ్రమైన భ్రమలో పడతాడని, అలా అనుకోవడం పొరపాటని హెచ్చరించారు. ధర్మాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలంటే ముందుగా మనస్సులో ఉన్న పాత, స్థిరపడిపోయిన అపోహల నుంచి బయటపడాలని ఆర్ఎస్ఎస్ చీఫ్ పిలుపునిచ్చారు.
సృష్టి ఆరంభం నుంచి అంతం వరకూ ధర్మం ఉనికిలో ఉంటుందని.. పుట్టుక నుంచి మరణం వరకూ ప్రతి ఒక్కరి జీవితంలోనూ అది భాగమేనని, సమస్త సంతోషానికి ధర్మమే మూలకారణమని మోహన్ భాగవత్ తెలిపారు.
ఇవీ చదవండి:
పైథాన్ను ఇట్టే పట్టేసి.. చేతికి చుట్టేసిన ఐటీ ఉద్యోగి.!
గ్రిల్లో చిక్కాడు.. కర్రలతో చితకబాదారు.. వీడియో వైరల్