Share News

లోక్‌సభకు మమతా బెనర్జీ .. బహరాంపుర్ నుంచి పోటీకి యోచన

ABN , Publish Date - Jun 05 , 2026 | 02:51 PM

తృణమూల్ కాంగ్రెస్‌‌కు లోక్‌సభలోనూ అసమ్మతి పెరుగుతున్న సంకేతాలు వెలువడుతుండటంపై ఆ పార్టీ సుప్రీం మమతా బెనర్జీ పార్లమెంటు దిగువసభకు పోటీ చేసే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది. ఇటీవల జరిగిన పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చేతిలో టీఎంసీ ఓటమి పాలై అధికారం కోల్పోయింది.

లోక్‌సభకు మమతా బెనర్జీ ..  బహరాంపుర్ నుంచి పోటీకి యోచన
Mamata Banerjee

కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్‌ (TMC)కు లోక్‌సభలోనూ అసమ్మతి పెరుగుతున్న సంకేతాలు వెలువడుతుండటంపై ఆ పార్టీ సుప్రీం మమతా బెనర్జీ (Mamata Banerjee) పార్లమెంటు దిగువసభకు పోటీ చేసే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది. ఇటీవల జరిగిన పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చేతిలో టీఎంసీ ఓటమి పాలై అధికారం కోల్పోయింది. 80 సీట్లు గెలుచుకుని ప్రతిపక్షానికే పరమితమైంది. ఈ నేపథ్యంలో లోక్‌సభకు పోటీ చేసే ఆలోచనలో మమతాబెనర్జీ ఉన్నట్టు పార్టీ వర్గాల సమాచారం.


బహరాంపుర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి మమతా బెనర్జీ పోటీ చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ నియోజకవర్గానికి ప్రస్తుతం టీఎంసీ ఎంపీ యూసఫ్ పఠాన్ ప్రాతినిధ్యం వహిస్తున్నారురు. ఆయనను రాజీనామా చేసి మమత పోటీకి మార్గం సుగమం చేయాలని కోరనున్నట్టు తెలుస్తోంది. 2011 ప్రపంచ కప్ విన్నింగ్ స్క్వాడ్‌లో ఒకరైన భారత మాజీ క్రికెటర్ పఠాన్ 2024 పార్లమెంటు ఎన్నికల్లో బహరాంపుర్ నుంచి గెలిచారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత అధీర్ రంజన్ చౌదరిపై 85,000 ఓట్ల ఆధిక్యంతో పఠాన్ గెలుపొందారు.


ఆరుసార్లు ఎంపీ

మమతా బెనర్జీ గతంలోనూ లోక్‌సభ సభ్యురాలిగా ఉన్నారు. కోల్‌కతా సౌత్ నుంచి ఆరుసార్లు ఎంపీగా గెలిచారు. అయితే తొలి ఎన్నిక మాత్రం జాదవ్‌పుర్ నియోజకవర్గం నుంచి సీపీఐ అగ్రనేత సోమనాథ్ ఛటర్జీపై పోటీ చేసి గెలుపొందారు. 2011లో బెంగాల్ అసెంబ్లీకి వెళ్లేంతవరకూ లోక్‌సభ సభ్యురాలిగానే ఆమె ఉన్నారు. ఆ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ ఘనవిజయం సాధించింది. కాగా, ఇటీవల కాలంలో పార్టీ నాయకత్వం పనితీరుపై లోక్‌సభ టీఎంసీ సీనియర్ ఎంపీల్లో అసమ్మతి తలెత్తెది. కొందరు పార్టీ వీడే ఆలోచనలో ఉన్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. మమతకు సన్నహితురాలిగా పేరున్న పార్టీ సీనియర్ ఎంపీ కాకోలి ఘోష్ దస్తిదార్ బహిరంగంగానే ఇటీవల తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. బరాసత్‌‌ నుంచి నాలుగు సార్లు ఎంపీగా ఉన్న ఆమె లోక్‌సభలో తనపై అనుచితంగా మాట్లాడుతున్నారంటూ టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీపై లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లాకు ఫిర్యాదు చేశారు. పార్టీ పనితీరును ప్రశ్నించిన సీనియర్ ఎంపీల్లో సుఖేందు శేఖర్ రాయ్, శాంతను సేన్ సైతం ఉన్నారు.


అసెంబ్లీలోనూ రెబల్స్ బెడద

ఇప్పటికే పశ్చిమబెంగాల్ అసెంబ్లీలో తిరుగుబాటును టీఎంసీ ఎదుర్కొంటోంది. టీఎంసీ బహిష్కృత నేత రితబ్రత బెనర్జీని అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా పార్టీకి చెందిన 57 మంది ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. స్పీకర్ రతీంద్ర బోస్ కూడా ఈ నియామకాన్ని గుర్తించారు. ఈ క్రమంలో ముందుగా లోక్‌సభలో అసమ్మతికి కళ్లెం వేసేందుకు దిగువ సభలో అడుగుపెట్టాలనే ఆలోచనలో మమతా బెనర్జీ ఉన్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.


ఇవి కూడా చదవండి..

కొత్త పార్టీ ప్రకటించిన అన్నామలై.. వచ్చే ఎన్నికల్లో పోటీకి సై..

గ్రేట్‌ నికోబార్‌ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా రాహుల్‌ గాంధీ ఆన్‌లైన్‌ క్యాంపెయిన్‌

Updated Date - Jun 05 , 2026 | 03:10 PM