Share News

నేను తొలిసారి ఎమ్మెల్యే అయినప్పుడు అమిత్ షా చిన్నపిల్లాడు: మల్లికార్జున ఖర్గే..

ABN , Publish Date - Aug 18 , 2026 | 01:42 PM

కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తాను తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన సమయంలో అమిత్ షా చిన్నపిల్లాడిగా ఉన్నారని వ్యాఖ్యానించారు.

నేను తొలిసారి ఎమ్మెల్యే అయినప్పుడు అమిత్ షా చిన్నపిల్లాడు: మల్లికార్జున ఖర్గే..
Congress president Mallikarjun Kharge

న్యూఢిల్లీ: కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తాను తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన సమయంలో అమిత్ షా చిన్నపిల్లాడిగా ఉన్నారని వ్యాఖ్యానించారు. ‘నేను తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పుడు అమిత్ షా చిన్నపిల్లాడు. ఇప్పుడు ఆయన మాకు దేశభక్తి గురించి బోధిస్తున్నారు’ అంటూ ఖర్గే విమర్శించారు. దేశభక్తిపై తమకు బీజేపీ నేతలు పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదని, కాంగ్రెస్ నేతల దేశభక్తిని ప్రశ్నించే నైతిక హక్కు ఆ పార్టీకి లేదన్నారు. గోవాలో జరిగిన కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభలో ఖర్గే ఈ వ్యాఖ్యలు చేశారు.


ఆగస్టు 15న కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమంలో వందేమాతరం గీతాన్ని ఆలపించడంపై వివాదం చెలరేగింది. గీతాన్ని మధ్యలోనే ఆపాలని సోనియా గాంధీ కోరారంటూ అమిత్ షా ఆరోపణలు గుప్పించారు. దీనిపై స్పందిస్తూ ఖర్గే నిప్పులు చెరిగారు. ‘మా ప్రజలు దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందిన వారు ఎవరైనా స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నారా?’ అని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతలను దేశభక్తి గురించి ప్రశ్నించడం మానుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ఉత్తరాఖండ్‌లో తన సభ అనంతరం జరిగిన శుద్ధీకరణ అంశాన్నీ ఖర్గే ప్రస్తావించారు. సభలో తాను ప్రసంగించిన తర్వాత ఓ రైట్‌వింగ్ సంస్థ.. శుద్ధీకరణ హోమం చేయడంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మతాన్ని ఇలాంటి చర్యలకు పరిమితం చేయడం సరికాదని వ్యాఖ్యానించారు. కాగా, అమిత్ షాపై ఖర్గే చేసిన తాజా వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.


మరోవైపు, వందేమాతరం గీతాన్ని ఆలపించడంపై చెలరేగిన వివాదం గురించి కాంగ్రెస్ ఇప్పటికే స్పష్టత ఇచ్చింది. గీతాన్ని ఆలపిస్తున్న సమయంలో ఖర్గే కోసం కుర్చీ ఏర్పాటు చేయాలని సోనియా గాంధీ సూచించారని వివరణ ఇచ్చింది. అంతేకానీ, గీతాన్ని మధ్యలో ఆపాలని చెప్పలేదని స్పష్టం చేసింది. బీజేపీ దీనిపై రాద్ధాంతం చేయడం సమంజసం కాదని పేర్కొంది.


ఈ వార్తలు కూడా చదవండి

ఝార్ఖండ్ ప్రభుత్వానికి కొత్త తలనొప్పులు.. ఉద్యమ బాట పట్టిన ప్రభుత్వ ఉద్యోగులు..

విద్యార్థులపై ఏకే-47తో కాల్పుల ఘటన.. సుప్రీంకోర్టులో బిహార్ ప్రభుత్వం అఫిడవిట్..

Updated Date - Aug 18 , 2026 | 02:01 PM