కారులో దారుణ ఘటన.. పోలీసులు వెళ్లి చూడగా..
ABN , Publish Date - Jun 26 , 2026 | 11:56 AM
మధ్యప్రదేశ్లోని అశోక్నగర్లో యువతి, యువకుడి మృతదేహాలు లభ్యం కావడం తీవ్ర కలకలం రేపుతోంది. ఓ నిర్మానుష్య ప్రదేశంలో పార్క్ చేసిన కారులో ఇద్దరి మృతదేహాలను పోలీసులు గుర్తించారు.
న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్లోని అశోక్నగర్లో యువతి, యువకుడి మృతదేహాలు లభ్యం కావడం తీవ్ర కలకలం రేపుతోంది. ఓ నిర్మానుష్య ప్రదేశంలో పార్క్ చేసిన కారులో ఇద్దరి మృతదేహాలను పోలీసులు గుర్తించారు. యువకుడి తలకు బుల్లెట్, ముఖంపై కాలిన గాయాలు కనిపించాయి. మరోవైపు యువతి గొంతు కోసి అత్యంత దారుణంగా హత్య చేసినట్లు కనిపిస్తోంది. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు వారిని రితిక్ సోని, ముస్కాన్గా పోలీసులు గుర్తించారు. ఈ సందర్భంగా కారులో మారణాయుధాలు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
అనంతరం పోలీసులు మాట్లాడుతూ.. బుధవారం మధ్యాహ్నం జిమ్ చేసేందుకు ముస్కాన్ ఇంటి నుంచి వెళ్లిపోయిందని తెలిపారు. రాత్రి అయినా ఆమె ఇంటికి రాలేదని.. ఎంత వెతికినా ప్రయోజనం లేకపోవడంతో బాధిత కుటుంబ సభ్యులు కోత్వాలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారన్నారు. మరోవైపు రితిక్ సుమారు 15 రోజుల కిందటే ఇండోర్ నుంచి అశోక్నగర్కు వచ్చారని పేర్కొన్నారు. యువతి కోసం గాలిస్తుండగా.. అశోక్నగర్ ప్రాంతంలో అనుమానాస్పదంగా పార్క్ చేసి ఉంచిన కారు కనిపించిందని తెలిపారు. దాన్ని పరిశీలించగా రెండు మృతదేహాలు కనిపించాయన్నారు. మృతులను రితిక్, ముస్కాన్గా గుర్తించినట్లు పోలీసులు వెల్లడించారు. వెంటనే ఘటనాస్థలికి ఫోరెన్సిక్ నిపుణులను పిలిపించి ఆధారాలు సేకరించినట్లు వివరించారు. వాహనం నుంచి ఓ తుపాకీ, రక్తపు మరకలతో ఉన్న గొడ్డలి, కట్టర్ను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.
ఈ కారుకు దాదాపు 50 అడుగుల దూరంలో మూడు మొబైల్ ఫోన్లనూ గుర్తించామని పోలీసులు చెప్పారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించామన్నారు. గతంలో వారిద్దరూ ఇండోర్లోని ఓ ప్రైవేట్ కంపెనీలో కలిసి పనిచేసినట్లు ప్రాథమిక విచారణలో గుర్తించామన్నారు. కుటుంబ సభ్యులు, బంధువులను ప్రశ్నిస్తున్నామని.. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఫోరెన్సిక్, పోస్టుమార్టం నివేదికల ఆధారంగా నిజానిజాలు తేలుస్తామని పేర్కొన్నారు. మరోవైపు యువతి, యువకులది ఆత్మహత్యా? లేక హత్యా? అనే కోణాల్లో ముమ్మర దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి
ఇష్టం లేదని చెప్పినా కేతన్ వినలేదు.. పుణె హత్య కేసులో మరో ట్విస్ట్..
నితిన్ నబిన్ ఆధ్వర్యంలో కొత్త టీమ్కు కసరత్తు