కేరళ పేరును కేరళంగా మార్చే బిల్లుకు లోక్సభ ఆమోదం..
ABN , Publish Date - Aug 11 , 2026 | 02:33 PM
కేరళ రాష్ట్రం పేరును కేరళంగా మార్చేందుకు ఉద్దేశించిన బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. విపక్ష సభ్యుల ఆందోళనల మధ్యే బిల్లును సభలో ప్రవేశపెట్టి మూజువాణి ఓటుతో ఆమోదించారు.
న్యూఢిల్లీ: కేరళ రాష్ట్రం పేరును కేరళంగా మార్చేందుకు ఉద్దేశించిన బిల్లుకు లోక్సభ ఇవాళ (మంగళవారం) ఆమోదం తెలిపింది. విపక్ష సభ్యుల ఆందోళనల మధ్యే బిల్లును సభలో ప్రవేశపెట్టి మూజువాణి ఓటుతో ఆమోదించారు. రాష్ట్రం పేరును కేరళంగా మార్చాలని కోరుతూ కేరళ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లును తీసుకొచ్చింది. అయితే, బిల్లుపై చర్చ జరుగుతున్న సమయంలో విపక్ష సభ్యులు సభలో ఆందోళనకు దిగారు. దీంతో గందరగోళ పరిస్థితి నెలకొంది.
అయినప్పటికీ బిల్లుపై ప్రక్రియను కొనసాగించిన సభ.. చివరకు మూజువాణి ఓటుతో ఆమోదించింది. తదుపరి ప్రక్రియలో భాగంగా బిల్లును రాజ్యసభకు పంపనున్నారు. రాష్ట్ర అధికారిక పేరును మలయాళంలో ‘కేరళం’గా ఉపయోగిస్తున్న నేపథ్యంలో అదే పేరును రాజ్యాంగపరంగానూ అమలు చేయాలన్న డిమాండ్ చాలాకాలంగా ఉంది. ఈ నేపథ్యంలో కేంద్రం తీసుకొచ్చిన సవరణ బిల్లుకు లోక్సభ ఆమోదం లభించింది. కాగా, ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద విద్యార్థులపై పోలీస్ చర్యలకు గాను పార్లమెంట్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్షాలు ఆందోళనకు దిగాయి.
ఈ వార్తలు కూడా చదవండి
ఓటు తొలగించటంపై వ్యంగ్యంగా స్పందించిన ప్రకాశ్ రాజ్
ఝార్ఖండ్ విద్యార్థుల నిరసన.. తమ చర్యలను సమర్థించుకున్న పోలీసులు