కైలాస మానస సరోవర యాత్ర తాత్కాలికంగా నిలిపివేత
ABN , Publish Date - Aug 27 , 2026 | 07:50 PM
నేపాల్- టిబెట్ సరిహద్దుల్లో సంభవించిన ప్రకృతి విపత్తుల కారణంగా కైలాస మానస సరోవర యాత్రను తాత్కాలికంగా నిలిపి వేస్తున్నట్లు చైనా ప్రకటించింది.
న్యూఢిల్లీ, ఆగస్టు 27: నేపాల్- టిబెట్ సరిహద్దుల్లో సంభవించిన ప్రకృతి విపత్తుల కారణంగా కైలాస మానస సరోవర యాత్రను తాత్కాలికంగా నిలిపి వేస్తున్నట్లు చైనా గురువారం ప్రకటించింది. పర్మిట్లు ఉన్నప్పటికీ భారత్ నుంచి వచ్చే తదుపరి యాత్రికుల బృందాల ప్రవేశంపై తక్షణం నిషేధం విధించినట్లు వివరించింది. చైనా సరిహద్దుల్లో ఇప్పటికే ఉన్న యాత్రికులను సురక్షితంగా వెనక్కి పంపుతున్నట్లు తెలిపింది. తీవ్ర వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఈ యాత్రను తాత్కాలికంగా వాయిదా వేసుకోవాలని యాత్రికులకు విజ్ఞప్తి చేసింది.
నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా వందలాది మంది మరణించగా, వేలాది మంది గల్లంతయ్యారు. వీరిలో భారతీయులు ఉన్నారు. కైలాస మాసన సరోవర యాత్ర కోసం వెళ్లిన వారిలో పలువురు ఆచూకీ లేకుండా పోయారు. ఈ పరిస్థితుల దృష్ట్యా యాత్రను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు చైనా ప్రకటించింది. మరో వైపు నేపాల్లో వరదల నేపథ్యంలో ఆ సరిహద్దుల్లో ఉన్న ఉత్తరప్రదేశ్లోని మహారాజ్ గంజ్, కుషినగర్ జిల్లాల్లో ప్రభుత్వం హైఅలర్ట్ ప్రకటించింది.
ఈ జిల్లాల్లో నదులు పొంగి ప్రవహించే అవకాశం ఉంది. దీంతో ఈ జిల్లాల్లోని నది పరివాహక ప్రాంతాల వద్ద ఉన్నతాధికారులతోపాటు భద్రత సిబ్బందిని మోహరించింది. అలాగే ప్రజలను అప్రమత్తం చేసింది. ఎలాంటి సవాళ్లు ఎదురైనా.. వాటిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని జిల్లా అధికారులను ప్రభుత్వం ఆదేశించింది.