114 రఫేల్స్ కావాలి!
ABN , Publish Date - Jun 03 , 2026 | 06:47 AM
భారత రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా కీలక ముందుడుగు పడింది. భారత వాయుసేన (ఐఏఎఫ్) కోసం 114 రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించి రక్షణ శాఖ...
ఫ్రాన్స్కు ఎల్వోఆర్ జారీ చేసిన భారత్
ఒప్పందంపై చర్చించేందుకు ఫ్రాన్స్ వెళ్లిన ఐఏఎఫ్ చీఫ్
రక్షణ రంగం బలోపేతం దిశగా కీలక ముందడుగు
న్యూఢిల్లీ, జూన్ 2: భారత రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా కీలక ముందుడుగు పడింది. భారత వాయుసేన (ఐఏఎఫ్) కోసం 114 రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించి రక్షణ శాఖ ఫ్రాన్స్కు అధికారికంగా అభ్యర్థన పత్రం (లెటర్ ఆఫ్ రిక్వెస్ట్) జారీ చేసింది. సుమారు రూ.3.25 లక్షల కోట్ల విలువైన ఈ రక్షణ ఒప్పందం కోసం రక్షణ శాఖకు చెందిన సేకరణ విభాగం గతవారం ఈ అభ్యర్థన పత్రాన్ని సమర్పించినట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ భారీ డీల్పై చర్చించేందుకు వైమానిక దళాధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్ సోమవారం ఫ్రాన్స్కు చేరుకున్నారు. నాలుగు రోజుల పర్యటనలో భాగంగా ఆయన ప్రతిపాదిత ఒప్పందంపై చర్చించడంతోపాటు రఫేల్ యుద్ధ విమానాల తయారీ సంస్థ దసో ఏవియేషన్ ప్లాంట్ను సందర్శించే అవకాశం ఉంది. ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ పర్యటన అనంతరం ఈ నెలలోనే ప్రధాని మోదీ కూడా ఫ్రాన్స్ పర్యటనకు వెళ్లే అవకాశం ఉంది. ఈ సందర్భంగా రఫేల్ ఒప్పందం చర్చకు వచ్చే అవకాశం ఉంది. కాగా, భారత్ సమర్పించిన లెటర్ ఆఫ్ రిక్వెస్ట్ (ఎల్వోఆర్)ను ఫ్రాన్స్ పరిశీలించి దానిపై 2-3 నెలల్లో స్పందించే అవకాశం ఉంది. అందులో ధర, ఉత్పత్తి సామర్థ్యం, లాజిస్టిక్స్ సపోర్ట్ వంటి అంశాలను వెల్లడిస్తుంది. ధర, ఇతర అంశాలపై తుది చర్చల అనంతరం ఈ ఏడాది చివరినాటికి ఒప్పందం కుదిరే అవకాశం ఉంది. ప్రతిపాదిత ఒప్పందం ప్రకారం.. మేకిన్ ఇండియా కార్యక్రమం కింద ఫ్రాన్స్కు చెందిన దసో ఏవియేషన్ ఒక భారతీయ సంస్థతో కలిసి 90 నుంచి 94 రఫేల్ యుద్ధ విమానాలను భారత్లోనే తయారు చేయాల్సి ఉంటుంది. మిగిలిన విమానాలను మాత్రం దసో ఏవియేషన్ ఫ్రాన్స్లోనే తయారుచేసి వాటిని ఎగిరే స్థితిలో భారత్కు అందజేస్తుంది.
114 రఫేల్స్ ఒప్పందంతోపాటు.. విమాన వాహక యుద్ధనౌకల కోసం భారత నౌకాదళం దసో ఏవియేషన్ నుంచి ప్రత్యేకంగా రూపొందించిన 26 రఫేల్ మెరైన్ యుద్ధ విమానాలను సేకరించనుంది. దీనికి సంబంధించిన ఒప్పందం గతేడాది ఏప్రిల్ 28న కుదిరింది. 2016లో కుదిరిన ఒప్పందం కింద అందుకున్న 36 రఫేల్ ఫైటర్ జెట్లను వాయుసేన ఇప్పటికే వినియోగిస్తోంది. తాజా ప్రతిపాదిత ఒప్పందం కుదిరి 114 రఫేల్స్ను అందుకుంటే భారత్ వద్ద ఉండే రఫేల్స్ బలం 176కు పెరుగుతుంది. భారత వాయుసేన అధికారికంగా తన బలాన్ని 42 స్క్వాడ్రన్లకు పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ.. పాత విమానాల సేవల విరమణ, కొత్త విమానాల సేకరణ, ఉత్పత్తిలో జాప్యం కారణంగా ప్రస్తుతం ఐఏఎఫ్ వద్ద 29 యాక్టివ్ స్క్వాడ్రన్లు మాత్రమే ఉన్నాయి.మిగ్-21లను దశలవారీగా తొలగించిన తర్వాత భారత్కు ఫైటర్ జెట్ల కొరత తీవ్రమైంది.
Also Read:
ఖర్జూరాలు.. కొలెస్ట్రాల్ తగ్గించడంలో సహాయపడతాయా?
చిన్న పిల్లాడిలా మారి.. డ్యాన్స్ చేసిన విరాట్! వీడియో వైరల్...
For More Latest News