Share News

ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన నవవధువు.. కాల్వలో పడేసి ప్రమాదంగా చిత్రీకరణ!

ABN , Publish Date - Jul 05 , 2026 | 06:49 PM

పెళ్లయి ఇంకా కొన్ని రోజులు కాకముందే, తన వివాహేతర బంధానికి అడ్డుగా ఉన్నాడని ఒక నవవధువు తన ప్రియుడితో కలిసి భర్తను దారుణంగా హత్య చేయించిన ఉదంతం హర్యానాలో కలకలం సృష్టించింది.

ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన నవవధువు.. కాల్వలో పడేసి ప్రమాదంగా చిత్రీకరణ!
Haryana Newlywed, Lover Held for Allegedly Murdering Husband

గురుగ్రామ్ (హర్యానా), జులై 5: పెళ్లయి ఇంకా కొన్ని రోజులు కాకముందే, తన వివాహేతర బంధానికి అడ్డుగా ఉన్నాడని ఓ నవవధువు తన ప్రియుడితో కలిసి భర్తను దారుణంగా హత్య చేయించిన ఉదంతం హర్యానాలో కలకలం సృష్టించింది. తొలుత ఇదొక ప్రమాదవశాత్తు జరిగిన మరణంగా భావించినప్పటికీ, చివరికి అసలు నిజాలు బయటపడ్డాయి.


అసలేం జరిగిందంటే..?

జర్తాల్ గ్రామానికి చెందిన 21 ఏళ్ల మోను అనే యువకుడు స్థానికంగా చిన్న చిన్న పనులు చేస్తూ, ఇటీవల జలియావాస్‌లో ఒక షాపును కూడా ప్రారంభించాడు. అతనికి కొద్దిరోజుల క్రితమే కసోలి గ్రామానికి చెందిన తన్ను అనే యువతితో వివాహం జరిగింది. అయితే, ఈ పెళ్లి తన్నుకు ఇష్టం లేదు. వివాహానికి ముందే ఆమెకు సోను అనే యువకుడితో పాత ప్రేమ వ్యవహారం ఉంది. పెళ్లయిన తర్వాత కూడా ఆమె తన ప్రియుడితో నిరంతరం టచ్‌లోనే ఉంది. తమ ప్రేమకు అడ్డుగా ఉన్న భర్త మోనును ఎలాగైనా వదిలించుకోవాలని ఇద్దరూ కలిసి ఒక కిరాతక ప్లాన్ వేశారు.


పథకం ప్రకారం పిలిపించి..

జూన్ 8వ తేదీ రాత్రి, భార్య తన్ను పథకం ప్రకారం మోనును కసోలి గ్రామానికి రప్పించింది. అదే సమయంలో ప్రియుడు సోను పంపిన హరిఓమ్, అమన్ అనే ఇద్దరు వ్యక్తులు అక్కడ సిద్ధంగా ఉన్నారు. మోను అక్కడికి చేరుకోగానే, వారు అతడిని గట్టిగా పట్టుకుని, ముక్కు, నోరు మూసేసి ఊపిరాడకుండా చేశారు. మోను స్పృహ తప్పిపోవడంతో, అతడ్ని తీసుకెళ్లి అసల్వాస్ కాల్వలో పడేశారు. ఆ తర్వాత ఏమీ తెలియనట్లు మోను నడుపుతున్న ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కాల్వ ఒడ్డున వదిలేసి పరారయ్యారు.


అంత్యక్రియల్లో నవవధువు కన్నీటి డ్రామా!

జూన్ 10న కాల్వలో మోను మృతదేహం లభ్యమైంది. ఎలాంటి గాయాలు లేకపోవడంతో పోలీసులు దీనిని ప్రమాదంగా భావించి కేసు నమోదు చేసి శవాన్ని అప్పగించారు. భర్త చనిపోయాడని తెలియగానే తన్ను తన తల్లిదండ్రులు, సోదరుడితో కలిసి అత్తగారింటికి వచ్చింది. శవంపై పడి ఏడ్చింది, అంత్యక్రియల్లో పాల్గొంది, పుణ్యస్త్రీగా చేయాల్సిన అన్ని ఆచారాలను ఏడుస్తూ పూర్తి చేసింది. దీంతో ఆమె భర్త పోయిన బాధలో ఉందేమోనని అందరూ నమ్మారు.

ట్విస్ట్ ఇచ్చిన 'డిలీట్ చేసిన చాట్స్'

జూన్ 11న పోలీసులు మోను మొబైల్ ఫోన్‌ను కుటుంబ సభ్యులకు అప్పగించారు. అయితే ఫోన్ తెరిచి చూడగా అందులోని కాల్ హిస్టరీ, చాట్స్ అన్నీ డిలీట్ చేసి ఉండటంతో కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చింది. దీంతో వాళ్లు నిపుణులను కలిసి ఫోన్ డేటాను రికవరీ (Data Recovery) చేయించారు. ఆ డేటా బయటకు రాగానే సీన్ మొత్తం మారిపోయింది.

49 సార్లు కాల్స్: జూన్ 8న మోను అదృశ్యం కావడానికి ముందు తన్నుకు సోను 49 సార్లు కాల్ చేశాడు.

చాటింగ్స్ లీక్: రికవరీ అయిన చాట్స్‌లో తన్ను తనే మోనును రమ్మని పిలిచినట్లు, అలాగే ప్రియుడు సోనుతో కలిసి భర్తను వదిలించుకోవడానికి ప్లాన్ చేసినట్లు స్పష్టమైన ఆధారాలు దొరికాయి.

పోలీసుల నిర్లక్ష్యం.. ఎస్పీ రంగంలోకి దిగితేనే అరెస్ట్!

మోను దశదిన కర్మలు ముగిసేవరకు కుటుంబ సభ్యులు ఓపిక పట్టారు. ఆ తర్వాత ఈ బలమైన ఆధారాలను పోలీసులకు చూపించారు. అయితే స్థానిక కసోలా పోలీసులు మొదట ఈ ఆధారాలను సీరియస్‌గా తీసుకోలేదు. దీంతో జూన్ 21, జూన్ 30 తేదీల్లో కుటుంబ సభ్యులు డీఎస్పీని కలిశారు. అక్కడ కూడా న్యాయం జరగకపోవడంతో జూలై 2న నేరుగా జిల్లా ఎస్పీని ఆశ్రయించారు. ఎస్పీ ఆదేశాలతో రంగంలోకి దిగిన పోలీసులు భార్య తన్నును, హరిఓమ్‌ను అరెస్ట్ చేశారు.

విచారణలో తన్ను తన ప్రియుడు సోనుతో కలిసి భర్తను చంపినట్లు అంగీకరించింది. ప్రస్తుతం ప్రియుడు సోను, అతని అనుచరుడు అమన్ పరారీలో ఉన్నారని, వారి కోసం గాలిస్తున్నామని డీఎస్పీ సురేందర్ షియోరన్ తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి...

అల్లూరి ఆశయాలే దేశానికి మార్గదర్శకం: పవన్ కల్యాణ్

డ్వాక్రా మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేలా తృప్తి క్యాంటీన్‌లను ప్రోత్సహిస్తున్నాం: మంత్రి నారాయణ

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Jul 05 , 2026 | 07:03 PM