సంజయ్ గాంధీ నుంచి అజిత్ పవార్ వరకు.. ఆకాశంలో ప్రమాదాలు.. రాజకీయ విషాదాలు..
ABN , Publish Date - Jan 28 , 2026 | 12:17 PM
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ బుధవారం ఉదయం బారామతిలో జరిగిన విమాన ప్రమాదంలో మరణించారు. ఇంతకు ముందు కూడా పలువురు రాజకీయ నాయకులు విమాన, హెలికాఫ్టర్ ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయారు. వారిని మరోసారి తలుచుకుందాం..
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ బుధవారం ఉదయం బారామతిలో జరిగిన విమాన ప్రమాదంలో మరణించారు. ఉదయం 8:45 గంటల ప్రాంతంలో పవార్, అతని బృందం ప్రయాణిస్తున్న విమానం బారామతిలో అత్యవసరంగా ల్యాండ్ కావడానికి ప్రయత్నించినప్పుడు ఈ ప్రమాదం జరిగింది. ఇంతకు ముందు కూడా పలువురు రాజకీయ నాయకులు విమాన, హెలికాఫ్టర్ ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయారు. వారిని మరోసారి తలుచుకుందాం (Indian politicians air crashes)..
విజయ్ రూపానీ - 2025
గతేడాది అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరిన ఎయిరిండియా విమానం కూలిపోయిన ఘటనలో మరణించిన వారిలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ఉన్నారు. 68 ఏళ్ల రూపానీ యూకేలోని తన కుటుంబాన్ని కలవడం కోసం ఆ విమానం ఎక్కారు (Vijay Rupani helicopter crash).
దోర్జీ ఖండు - 2011
అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి దోర్జీ ఖండు ఏప్రిల్ 30, 2011న హెలికాప్టర్ కూలిపోవడంతో మరణించారు. చైనా సరిహద్దుకు సమీపంలోని మారుమూల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ఐదు రోజుల తర్వాత శిథిలాలను గుర్తించారు.
వై.ఎస్. రాజశేఖర రెడ్డి - 2009
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి సెప్టెంబర్ 2, 2009న నల్లమల కొండలలో హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. విస్తృతంగా గాలించడంతో ఒకరోజు తర్వాత ఆయన మృతదేహం లభ్యమైంది.

జిందాల్, సురేందర్ సింగ్ - 2005
పారిశ్రామికవేత్త, హర్యానా విద్యుత్ మంత్రి ఓపీ జిందాల్, మాజీ రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ కుమారుడు, మాజీ కేంద్ర మంత్రి సురేందర్ సింగ్ మార్చి 31, 2005న ఉత్తరప్రదేశ్లోని సహరాన్పూర్లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు (Indian helicopter crash history).
సిప్రియన్ సంగ్మా - 2004
మేఘాలయ గ్రామీణాభివృద్ధి మంత్రి సిప్రియన్ సంగ్మా 2004లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. 2004, సెప్టెంబర్ 22న గౌహతి నుంచి షిల్లాంగ్ వెళ్తున్న హెలికాప్టర్ బారపాణి సరస్సు సమీపంలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో సంగ్మాతో పాటు మరో తొమ్మిది మంది మరణించారు.
జీఎంసీ బాలయోగి - 2002
లోక్సభ స్పీకర్, టీడీపీ నాయకుడు జీఎంసీ బాలయోగి మార్చి 3, 2002న ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లాలో హెలికాప్టర్ కూలిపోవడంతో మరణించారు. యాంత్రిక లోపం కారణంగానే ఈ ప్రమాదం సంభవించిందని అధికారులు తేల్చారు.

మాధవరావు సింధియా - 2001
గ్వాలియర్ రాజ కుటుంబ సభ్యుడు, ప్రముఖ జాతీయ నాయకుడు మాధవరావు సింధియా సెప్టెంబర్ 30, 2001న ఉత్తరప్రదేశ్లోని మెయిన్పురి జిల్లాలో తన చార్టర్డ్ విమానం కూలిపోవడంతో మరణించారు. కాన్పూర్లో ఒక ర్యాలీలో ప్రసంగించడానికి ఆయన వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది.
సంజయ్ గాంధీ - 1980
ఇందిరా గాంధీ కుమారుడు, జాతీయ రాజకీయాల్లో కీలక నాయకుడిగా చెలామణి అయిన సంజయ్ గాంధీ జూన్ 23, 1980న తాను నడుపుతున్న రెండు సీట్ల విమానం కూలిపోవడంతో మరణించారు. ఢిల్లీలోని సఫ్దర్జంగ్ విమానాశ్రయం సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. (Sanjay Gandhi plane crash)

గుర్నామ్ సింగ్ - 1973
పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి గుర్నామ్ సింగ్ మే 31, 1973న ఢిల్లీలో జరిగిన విమాన ప్రమాదంలో మరణించారు.
బల్వంత్ రాయ్ మెహతా - 1965
గుజరాత్ రెండో ముఖ్యమంత్రి అయిన బల్వంత్ రాయ్ మెహతా 1965 ఇండో-పాకిస్థాన్ యుద్ధ సమయంలో మరణించారు. సరిహద్దు సమీపంలో ఆయన ప్రయాణిస్తున్న పౌర విమానాన్ని పాక్ వైమానిక దళం పొరపాటున యుద్ధ విమానంగా భావించి పేల్చేసింది.
ఇవి కూడా చదవండి..
సూపర్.. మార్కెటింగ్ అంటే ఇలా ఉండాలి.. ప్లాస్టిక్ టబ్లు ఇంత గట్టిగా ఉంటాయా..
చిలుకల మధ్యలో సీతాకోక చిలుక.. 15 సెకెన్లలో ఆ సీతాకోకచిలుకను కనిపెట్టండి..