పేదరికంపై ‘డాక్టర్’ అస్త్రం
ABN , Publish Date - Sep 16 , 2026 | 06:32 AM
‘పట్టుదలతో చేస్తే సమరం, తప్పకుండా నీదే విజయం’ అని ఓ సినీ కవి చెప్పినది ఒడిశాకు చెందిన ఆ గిరిజన కుటుంబం నిష్ఠగా ఆచరించింది. తమ పేదరికం పోవాలంటే...
ఒకే గిరిజన కుటుంబం నుంచి వైద్యులు కాబోతున్న ఐదుగురు
స్ఫూర్తినిస్తున్న ఒడిశాలోని కంధమాల్ కుటుంబం విజయగాథ
భువనేశ్వర్, సెప్టెంబరు 15: ‘పట్టుదలతో చేస్తే సమరం, తప్పకుండా నీదే విజయం’ అని ఓ సినీ కవి చెప్పినది ఒడిశాకు చెందిన ఆ గిరిజన కుటుంబం నిష్ఠగా ఆచరించింది. తమ పేదరికం పోవాలంటే కష్టపడి చదవడమే మార్గమని ఆ కుటుంబం భావించింది. తాజాగా నిర్వహించిన నీట్ పరీక్షలో ముగ్గురు అక్కచెల్లెళ్లు ర్యాంకులు సాధించడం అందర్నీ ఆకర్షించింది. అయితే వీరి గురించి ఆరా తీస్తే.. వీరు ముగ్గురే కాదు, వీరి కుటుంబంలో మరో ఇద్దరు కూడా ‘నీట్’ అడ్డంకిని సులువుగా దాటేసి త్వరలో డాక్టర్ పట్టా పుచ్చుకోబోతున్నారని తెలిసింది. కంధమాల్ జిల్లాలో ఓ మారుమూల కొండపై, చుట్టూ దట్టమైన అడవి ఉండే శిఖబడి గ్రామంలోని బృషి నాయక్, అనుసయ కుటుంబంలోని వారే కాబోయే ఆ ఐదుగురు డాక్టర్లు. బృషినాయక్ పెద్దకొడుకు బిభీషణ్ నాయక్ కోరాపుట్లోని షహీద్ లక్ష్మణ్నాయక్ మెడికల్ కాలేజీలో ఇంటర్న్షిప్ చేస్తున్నారు. అతని మొదటి చెల్లెలు మోనాలిసా సెకెండియర్ మెడికల్ విద్యార్థిని. వీరి చెల్లెళ్లు సునేమీ, ఆశ్రియ, మీనాక్షి కూడా నీట్లో ర్యాంకు కొట్టి వరుసగా పూరి, బోలంగిర్, భవానీపాట్నా ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో చేరారు. వీరిలో మీనాక్షి మాత్రం బృషినాయక్ తమ్ముడి కుమార్తె. అయితే చిన్నప్పటి నుంచి బృషినాయక్ ఆమెను పెంచి తమ సొంత బిడ్డలాగే చూసుకున్నారు. వీరి కుటుంబంలోని మరో ఇద్దరు బాలురు స్కూలుకు వెళ్తున్నారు. చదువులో మంచి ప్రతిభ కనబరుస్తున్నారు. అత్యంత కఠినమైన పరిస్థితుల్లో కూడా పట్టుదలతో చదివితే అవకాశాల ద్వారాలు వాటంతట అవే తెరుచుకుంటాయి అని వీరి విజయగాథను చూసిన వారు కొనియాడుతున్నారు.
ఇవి కూడా చదవండి...
ఏపీపీఎస్సీ గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల
చంపేస్తానంటూ బెదిరింపులు.. నెల్లూరులో రెచ్చిపోయిన వైసీపీ రౌడీ మూకలు
Read Latest AP News And Telugu News