ఒకటే పేరు.. 23 డెబిట్ కార్డులు
ABN , Publish Date - Jun 18 , 2026 | 06:26 AM
భారతీయ బ్యాంకింగ్ నిబంధనలను ఉల్లంఘించి విదేశాల నుంచి అడ్డదారిలో నిధులను మన దేశంలోని మళ్లించడానికి వినియోగిస్తున్న ఓ అధునాతన అంతర్జాతీయ నెట్వర్క్...
భారత్లో కార్యకలాపాలకు అమెరికా ఎన్జీవో అక్రమ నెట్వర్క్
ఈడీ దర్యాప్తులో గుర్తింపు
న్యూఢిల్లీ, జూన్ 17: భారతీయ బ్యాంకింగ్ నిబంధనలను ఉల్లంఘించి విదేశాల నుంచి అడ్డదారిలో నిధులను మన దేశంలోని మళ్లించడానికి వినియోగిస్తున్న ఓ అధునాతన అంతర్జాతీయ నెట్వర్క్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దర్యాప్తులో వెలుగు చూసింది. ఖాతాదారులు కాని భారత్లోని వ్యక్తులకు అమెరికాకు చెందిన ట్రూయిస్ట్ బ్యాంక్ డెబిట్ కార్డులు జారీ చేసిందని విచారణలో ఈడీ కనుగొంది. దీని వెనకాల అమెరికాకు చెందిన ఎన్జీవో ది తిమోతీ ఇనీషియేటివ్ (టీటీఐ) ఉన్నట్లు గుర్తించింది. విదేశీ డెబిట్ కార్డుల నెట్వర్క్ ద్వారా దేశంలోకి విదేశీ నిధులను మళ్లించడానికి భారత్కు చెందిన వ్యక్తులనే వినియోగించుకున్న కుట్ర వ్యవహారం దీనిలో ఉంది. 2009 నుంచి ట్రూయిస్ట్ బ్యాంక్ భారతదేశ వ్యాప్తంగా 1000కి పైగా డెబిట్ కార్డులను జారీ చేసినట్లు దర్యాప్తులో బయటపడింది. ఈ నెట్వర్క్ ద్వారా నవంబరు 2025 నుంచి ఏప్రిల్ 2026 మధ్య రూ. 92.55 కోట్లు (9.99 మిలియన్ డాలర్లు) భారత్కు అక్రమంగా వచ్చాయి. ప్రత్యేకంగా జనవరి 2024 నుంచి మార్చి 2026 మధ్య ఏటీఎంల నుంచి రూ. 44 కోట్లు విత్డ్రా చేశారు. చట్ట సంస్థలు, ఆర్థిక సంస్థల స్ర్కూటినీ నుంచి తప్పించుకోవడానికి ఆ నెట్వర్క్ ఎంచుకున్న మార్గం దర్యాప్తులో మరో కీలకాంశంగా నిలుస్తోంది. టీటీఐ ఫైనాన్స్ హెడ్ అజిత్ వర్గీస్ మథాయ్ ఆదేశాల మేరకు పాత ప్రాంతీయ గుర్తింపు కోడ్ల స్థానంలో సంతోష్ కుమార్ అనే భారతీయ వ్యక్తి పేరుపై 23 డెబిట్ కార్డులను ముద్రించారు. కార్డు వినియోగదారుల గుర్తింపును దాచి పెట్టడానికి, కేవైసీ నిబంధనలను తప్పించుకోవడానికి అలా చేసినట్లు ఈడీ కనుగొంది.
ఇవీ చదవండి:
సైబర్ నేరస్థులు 'పరాన్నజీవులు'.. సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
ఐఎస్ఐ సంబంధిత ఉగ్ర ముఠా గుట్టురట్టు.. ఏడుగురి అరెస్ట్