గ్రామస్తులను టెన్షన్ పెట్టిన మందు బాబు.. చివరకు ఏమైందంటే..
ABN , Publish Date - Jun 25 , 2026 | 12:28 PM
పీకల దాకా తాగిన మందు బాబు.. గ్రామస్తులను అలా ఇలా కాదు ఓ రేంజ్లో టెన్షన్ పెట్టేశాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లో చోటు చేసుకుంది.
ఇంటర్నెట్ డెస్క్: మద్యం మత్తులో ఓ వ్యక్తి 11,000 వోల్టుల సరఫరా అవుతున్న విద్యుత్ స్తంభం ఎక్కాడు. విద్యుత్ తీగలపై పడుకుని.. ఉయ్యాల ఊగాడు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులంతా భయాందోళనతో అక్కడికి చేరుకున్నారు. అతడిని కిందికి దింపేందుకు వారంతా ముకుమ్మడి ప్రయత్నాలు చేశారు. అతడు మాత్రం కిందికి దిగే ప్రసక్తే లేదన్నాడు. దీంతో విద్యుత్ శాఖ అధికారులతోపాటు బీతౌలి పోలీసులకు వారు సమాచారం ఇచ్చారు. వారు కూడా అక్కడికి చేరుకున్నారు. ఆయా శాఖల అధికారుల సమన్వయంతో ఆ ప్రాంతంలో విద్యుత్ సరఫరాను పూర్తిగా నిలిపి వేశారు.
అనంతరం.. ఆ ముందు బాబును కిందికి దింపేందుకు కొన్ని గంటల పాటు వారంతా తమ వంతు ప్రయత్నాలు చేశారు. చివరికి ఆ ప్రయత్నంలో వారంతా సఫలీకృతులయ్యారు. దాంతో ఆ మందు బాబు విద్యుత్ స్తంభం పైనుంచి కిందికి దిగాడు. దీంతో అతడి కుటుంబ సభ్యులతోపాటు గ్రామస్తులంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ మహారాజ్గంజ్ జిల్లాలోని పర్సాఖుర్ధా గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది.
ఈ గ్రామానికి చెందిన దీనదయాళ్ తాను ఏం చేస్తున్నాడో.. తనకే తెలియనంతగా తాగేశాడు. అనంతరం విద్యుత్ స్తంభం ఎక్కాడు. అయితే అతడు ఆ స్తంభం ఎక్కే జస్ట్ కొన్ని నిమిషాల ముందే విద్యుత్ సరఫరా అగిపోయింది. లేకుంటే పెద్ద ప్రమాదమే జరిగేదని దీనదయాళ్ కుటుంబ సభ్యులతోపాటు గ్రామస్తులు ఆందోళన చెందారు.