Share News

మధ్యప్రదేశ్‌ ధార్ జిల్లాలో ఘోర ప్రమాదం.. ఆరుగురి మృతి..

ABN , Publish Date - Aug 09 , 2026 | 04:38 PM

మధ్యప్రదేశ్‌ ధార్ జిల్లాలో ఆదివారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బద్నావర్-ఉజ్జయిన్ రహదారిపై కారు, లారీని ఢీకొని ఆరుగురు అక్కడికక్కడే మృతిచెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.

మధ్యప్రదేశ్‌ ధార్ జిల్లాలో ఘోర ప్రమాదం.. ఆరుగురి మృతి..
Dhar Road Accident

మధ్యప్రదేశ్‌: ధార్ జిల్లాలో ఇవాళ (ఆదివారం) మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బద్నావర్-ఉజ్జయిన్ రహదారి పంచకవాస వద్ద ప్రమాదవశాత్తూ అదుపుతప్పి కారును లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతిచెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు హుటాహుటిన వాహనాల వద్దకు చేరుకుని క్షతగాత్రుడిని బయటకు తీశారు.


అనంతరం బద్నవార్‌లోని సివిల్ ఆస్పత్రికి బాధితుడిని తరలించారు. సమాచారం అందుకున్న బద్నవార్ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ అమిత్ సింగ్ కుష్వా తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికుల సహాయంతో నుజ్జునుజ్జు అయిన కారు నుంచి అతి కష్టం మీద మృతదేహాలను వెలికితీశారు. వాటిని బద్నవార్ సివిల్ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై ఏఎస్పీ పరుల్ బేలాపుర్కర్ స్పందించారు. లారీ ప్రమాదవశాత్తూ కారును ఢీకొట్టినట్లు తెలిపారు. ఈ ఘటనలో ఆరుగురు మృతిచెందగా.. ఒకరు గాయపడినట్లు వెల్లడించారు.


బాధితులంతా గుజరాత్‌లోని వడోదరకు చెందిన వారిగా తెలిపారు. వారంతా ఉజ్జయిన్‌లోని మహాకాలేశ్వర ఆలయాన్ని సందర్శించి తిరిగి వెళ్తుండగా ప్రమాదానికి గురైనట్లు వెల్లడించారు. ఘటనపై కేసు నమోదు చేశామని, ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్‌ని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. బాధిత కుటుంబాలకు సమాచారం అందించామని, తదుపరి విచారణ కొనసాగుతోందని ఏఎస్పీ పరుల్ బేలాపుర్కర్ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

బారామతిలో మరో విమాన ప్రమాదం.. పైలట్లకు తప్పిన ప్రాణాపాయం..

డీలిమిటేషన్ బిల్లుపై ఉమ్మడి వ్యూహాన్ని ప్రకటిస్తాం: ఖర్గే

Updated Date - Aug 09 , 2026 | 05:02 PM