పెల్లెట్ గన్స్ ఘటనపై కేసు.. ప్రియాంకతో కలిసి రాహుల్ ధర్నా
ABN , Publish Date - Aug 21 , 2026 | 07:04 PM
విద్యార్థులపై పెల్లెట్ గన్స్ ప్రయోగించారనే ఆరోపణలపై ఢిల్లీలో రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. బాధ్యులపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా పలువురు కాంగ్రెస్ నేతలు పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్లోనే బైఠాయించారు.
ఢిల్లీ, ఆగస్టు 21: విద్యార్థులపై పెల్లెట్ గన్స్ ప్రయోగించారనే ఆరోపణలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రాతో పాటు ఇతర కాంగ్రెస్ నేతలు పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్లో బైఠాయించి నిరసనకు దిగారు. విద్యార్థులపై పెల్లెట్ గన్స్తో కాల్పులు జరిపిన వారిపై వెంటనే కేసు నమోదు చేసి.. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా రాహుల్ డిమాండ్ చేశారు. పెల్లెట్ గన్స్ కారణంగా గాయాలైన విద్యార్థి సాహిల్ లోచావ్ను వెంట తీసుకుని రాహుల్ గాంధీ పోలీస్ స్టేషన్కు వెళ్లారు. కాల్పుల జరిపిన ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసి.. బాధ్యులపై కేసు నమోదు చేయాలని పట్టుబట్టారు. విద్యార్థులపై బలప్రయోగం చేయడంపై ప్రభుత్వం, పోలీసులు స్పష్టమైన సమాధానం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
రాహుల్ గాంధీ పోలీస్ స్టేషన్లోనే బైఠాయించి నిరసన చేపట్టడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రాహుల్తో పాటు ప్రియాంక గాంధీ, ఇతర కాంగ్రెస్ నాయకులు కూడా నిరసనలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు పెల్లెట్ గన్స్ ఫైరింగ్ ఘటనపై ఎట్టకేలకు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. గుర్తుతెలియని వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. విద్యార్థులపై పెల్లెట్ గన్స్ ప్రయోగించిన ఘటనకు బాధ్యులెవరో గుర్తించి చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. రాహుల్ గాంధీ ధర్నా నేపథ్యంలో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.
ఈ వార్తలు కూడా చదవండి
భారత నావికులు ప్రయాణిస్తున్న నౌకపై ఇరాన్ దాడి.. బయటకొచ్చిన వీడియో..
నేను వచ్చానని అద్దె విద్యార్థులను తీసుకొచ్చారు: అభిజీత్ సంచలన ఆరోపణలు..