Share News

రాజకీయ నేపథ్యం ఉన్నా రాజ్యసభకు నామినేట్ చేయొచ్చు: ఢిల్లీ హైకోర్టు

ABN , Publish Date - May 29 , 2026 | 08:42 PM

రాజ్యసభ నామినేషన్లపై ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. రాజకీయ నేపథ్యం ఉన్న వ్యక్తులను కూడా రాష్ట్రపతి రాజ్యసభకు నామినేట్ చేయవచ్చని స్పష్టం చేసింది.

రాజకీయ నేపథ్యం ఉన్నా రాజ్యసభకు నామినేట్ చేయొచ్చు: ఢిల్లీ హైకోర్టు
Delhi High Court On Rajya Sabha Nomination

ఢిల్లీ: రాజ్యసభ నామినేషన్ అంశంపై ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. రాజకీయ నేపథ్యం ఉన్న వ్యక్తులను కూడా రాష్ట్రపతి రాజ్యసభకు నామినేట్ చేయవచ్చని స్పష్టం చేసింది. బీజేపీ నేత సి.సదానందన్ మాస్టర్‌కు రాజ్యసభ నామినేషన్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది.


కేవలం ఎన్నికల్లో పోటీ చేసినందుకుగానీ లేదా రాజకీయాల్లో ఉన్నందుకుగానీ ఎవరినీ రాజ్యసభ నామినేషన్‌కు అనర్హులుగా పరిగణించలేమని హైకోర్టు స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 80(3) ప్రకారం అర్హతలను నిర్ణయించడంలో అటువంటి పరిమితులు లేవని తెలిపింది.


అలాగే రాజ్యాంగంలో పేర్కొన్న 'సామాజిక సేవ' అనే పదానికి విస్తృతమైన అర్థం ఉందని కోర్టు వ్యాఖ్యానించింది. సామాజిక సేవలో వివిధ రంగాల్లో చేసిన సేవలు కూడా వస్తాయని తెలిపింది. రాజ్యసభ నామినేషన్ల విషయంలో అర్హులను ఎంపిక చేసే అధికారాలు రాష్ట్రపతికి విస్తృతంగా ఉన్నాయని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో పిటిషన్‌ను కొట్టివేస్తూ తీర్పు ఇచ్చింది.


Also Read:

ప్రతి 10 మందిలో 7 మందికి ఫైబర్ లోపం.. షాకింగ్ రిపోర్ట్

తెలంగాణ రైతుల కృషితోనే ఈ అగ్రస్థానం: మంత్రి తుమ్మల

For More Latest News

Updated Date - May 29 , 2026 | 09:03 PM