Share News

కేజ్రీవాల్‌కు ఢిల్లీ హైకోర్టు నోటీసులు

ABN , Publish Date - Apr 01 , 2026 | 04:36 PM

ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఆయనకు ఢిల్లీ హైకోర్టు బుధవారంనాడు నోటీసులు పంపింది.

కేజ్రీవాల్‌కు ఢిల్లీ హైకోర్టు నోటీసులు
Arvind Kejriwal

న్యూఢిల్లీ: ఎక్సైజ్ పాలసీ (Excise Policy)కి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) కన్వీనర్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)కు ఎదురుదెబ్బ తగిలింది. ఆయనకు ఢిల్లీ హైకోర్టు (Delhi High Court) బుధవారంనాడు నోటీసులు పంపింది. ఎక్సైజ్ పాలసీ కేసులో సమన్లు జారీ చేసినప్పటికీ కేజ్రీవాల్ హాజరుకాలేదంటూ ఈడీ నమోదు చేసిన రెండు వేర్వేరు కేసుల్లో ఆయనను రౌస్ ఎవెన్యూ కోర్టు ఇటీవల నిర్దోషిగా ప్రకటించింది. దీనిని ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరెక్టరేట్ హైకోర్టులో సవాలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు కేజ్రీవాల్‌కు తాజాగా నోటీసులు పంపింది. తదుపరి విచారణను ఏప్రిల్ 29వ తేదీకి వాయిదా వేసింది.


ఈడీ పిటిషన్‌పై జస్టిస్ స్వర్ణకాంత శర్మ నేతృత్వంలోని ఏకసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. కేజ్రీవాల్‌కు ముందుగానే నోటీసులు ఇచ్చినప్పటికీ ఆయన ఉద్దేశపూర్వకంగానే విచారణకు హాజరుకాలేదని ఈడీ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు. కేజ్రీవాల్‌ను నిర్దోషిగా ప్రకటించి ట్రయల్ కోర్టు తప్పిందం చేసిందన్నారు. ఈడీ వాదనలు విన్న ధర్మాసనం కేజ్రీవాల్‌కు నోటీసులు జారీ చేయాలని ఆదేశిస్తూ ఈనెల 29వ తేదీకి కేసును వాయిదా వేసింది.


దీనికిముందు, మనీలాండరింగ్ కేసులో కేజ్రీవాల్‌పై విచారణకు తగిన ఆధారాలు లేవంటూ ఫిబ్రవరి 27న విచారణ కోర్టు ఆయనను నిర్దోషిగా ప్రకటించింది. కేజ్రీవాల్‌తో పాటు సిసోడియా, మరో 21 మందిని లిక్కర్ పాలసీ కేసులో నిర్దోషులుగా ప్రకటించింది. ఈ తీర్పును సవాలు చేస్తూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌ కూడా ప్రస్తుతం హైకోర్టు విచారణలో ఉంది.


ఇవి కూడా చదవండి..

ఎన్డీయే వస్తే తమిళనాడును దక్షిణ ప్రదేశ్‌గా మార్చేస్తారు: స్టాలిన్

కాంగ్రెస్ ప్రిన్స్‌కు వందోసారి కూడా ఓటమి ఖాయం: మోదీ

Updated Date - Apr 01 , 2026 | 05:27 PM