Share News

ఢిల్లీలో బస్సు యజమానులకు కీలక ఆదేశాలు..

ABN , Publish Date - Sep 02 , 2026 | 11:15 AM

దేశ రాజధాని ఢిల్లీలో బస్సు యజమానులకు ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. బస్సులో పానిక్ బటన్స్, వాహనం ట్రాకింగ్ పరికరాలు కచ్చితంగా ఏర్పాటు చేయాలని బస్సు ఆపరేటర్లకు స్పష్టం చేసింది.

ఢిల్లీలో బస్సు యజమానులకు కీలక ఆదేశాలు..

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 02: దేశ రాజధాని ఢిల్లీలో ఇటీవల కదులుతున్న బస్సులో టీనేజర్‌పై గ్యాంగ్ రేప్ జరిగిన నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బస్సులో పానిక్ బటన్స్, వాహనం ట్రాకింగ్ పరికరాలు కచ్చితంగా ఏర్పాటు చేయాలని బస్సు యజమానులకు స్పష్టం చేసింది. ఇవి అన్ని వేళలా పని చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. బస్సు కిటికీ అద్దాలకు కర్టెన్స్‌ వేయొద్దని పేర్కొంది. అనధికారికంగా కిటికీ అద్దాలకు ఫిల్మ్‌ అతికించవద్దని తెలిపింది.

ఈ మేరకు ఢిల్లీ ప్రభుత్వం ఈ ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీలోని బస్సు ఆపరేటర్లు, వివిధ రాష్ట్రాల నుంచి ఇక్కడి చేరుకునే వాహనాలతోపాటు అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులకు ఈ నిబంధనలు వర్తిస్తాయని రవాణా శాఖ స్పష్టం చేసింది. మహిళ ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. బస్సుల్లో డ్రైవర్, కండక్టర్ తదితర సిబ్బందిని నియమించే సమయంలో కచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలని ఆపరేటర్లకు సూచించింది.


అలాగే బస్సుల్లో పానిక్ బటన్లు, వెహికల్ లోకేషన్ ట్రాకింగ్ పరికరాలు కచ్చితంగా పని చేస్తూ ఉండాలంది. ఇవి అన్ని వేళలా పని చేస్తుండాలని తెలిపింది. బస్సులో ప్రయాణికులకు అందుబాటులో ఉండేలా వీటిని ఏర్పాటు చేయాలని సూచించింది. అదే విధంగా ప్రతి బస్సులో అగ్నిప్రమాదం సంభవించిన సమయంలో వినియోగించే పరికరాలతోపాటు ఫస్ట్ ఎయిడ్ కిట్ అందుబాటులో ఉంచాలంది. అదే విధంగా రాత్రి లేదా రద్దీ లేని సమయాల్లో బస్సులను సురక్షితమైన, తగినంత వెలుతురు ఉన్న ప్రదేశాల్లో మాత్రమే నిలిపి ఉంచేలా చూడాలని ఆపరేటర్లకు స్పష్టం చేసింది.


బస్సులో సిబ్బంది ఎవరైనా అమర్యాదగా ప్రవర్తిస్తే.. వెంటనే సమీపంలోని పోలీస్ స్టేషన్‌లో లేదా సీపీఆర్‌లో ఫిర్యాదు చేయాలని మహిళా ప్రయాణికులను కోరింది. ఈ నిబంధనలు అమలు చేయకుంటే కఠిన చర్యలు తప్పవని బస్సు ఆపరేటర్లకు ఈ సందర్భంగా ప్రభుత్వం వార్నింగ్ ఇచ్చింది.

ఈ ఆదేశాలపై ఢిల్లీ రవాణా శాఖ మంత్రి పంకజ్ కుమార్ సింగ్ స్పందించారు. ప్రయాణికుల భద్రతలో ఎక్కడా రాజీపడబోమని స్పష్టం చేశారు. ఢిల్లీలో నడిచే ప్రతి బస్సులో సురక్షితమైన ఆపరేషనల్ స్టాండర్స్‌ను అమలు చేస్తామన్నారు. ప్రతి ప్రయాణికుడి భద్రతను దృష్టిలో ఉంచుకుని ప్రజా రవాణా వాహనాలను నడుపుతామని వివరించారు.


ఉత్తరప్రదేశ్‌లోని మైన్‌పూర్ నుంచి ఢిల్లీ చేరిన 16 ఏళ్ల బాలికపై ఆగస్టు 4వ తేదీన బస్సులో గ్యాంగ్ రేప్ జరిగింది. అలాగే 2012లో ఢిల్లీలో నిర్భయ ఘటన అనంతరం బస్సుల్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలనే నిబంధనను ప్రభుత్వం విధించింది. కానీ తాజా ఘటనలో బస్సులో సీసీటీవీ పనిచేయడం లేదని పోలీసుల దర్యాప్తులో స్పష్టమైంది. మరోవైపు ఈ గ్యాంగ్ రేపునకు పాల్పడిన నిందితులను ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేసిన విషయం విదితమే.


ఈ వార్తలు కూడా చదవండి..

రహదారిపై కారు ఆపి నిద్రపోయాడు.. కారణం తెలిస్తే అవాక్కవాల్సిందే.. వీడియో వైరల్

జూబ్లీహిల్స్‌లో భారీ చోరీ.. వ్యాపారవేత్త ఇంట్లో వజ్రాభరణాలు మాయం

Updated Date - Sep 02 , 2026 | 11:50 AM