ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో పొగలు.. లఖ్నవూలో ఎమర్జెన్సీ ల్యాండింగ్
ABN , Publish Date - Mar 31 , 2026 | 09:29 PM
పశ్చిమబెంగాల్లోని బాగ్డోగ్రా నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానం మంగళవారం సాయంత్రం సాంకేతిక కారణాలతో లఖ్నవూ విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. విమానం గాలిలో ఉండగానే పొగలు రావడంతో పైలట్ 'మేడే కాల్' సంకేతాలు ఇచ్చారు.
లఖ్నవూ: పశ్చిమబెంగాల్లోని బాగ్డోగ్రా నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఎయిరిండియా ఎక్స్ప్రెస్ (Air India Express) విమానం మంగళవారం సాయంత్రం సాంకేతిక కారణాలతో లఖ్నవూ విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. విమానం గాలిలో ఉండగానే పొగలు రావడంతో పైలట్ 'మేడే కాల్' సంకేతాలు ఇచ్చారు. ఆ వెంటనే లఖ్నవూలోని చౌదరి చరణ్ సింగ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి తరలించి అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ఆ సమయంలో విమానంలో 148 మంది ప్రయాణిస్తున్నారు. ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నట్టు ఎయిరిండియా ఎక్స్ప్రెస్ ప్రతినిధి తెలిపారు.
విమానంలో ఎలక్ట్రానిక్ పరికరాలను భద్రపరిచే ప్రత్యేక విభాగం 'ఏవియానిక్స్ బే'లో పొగలు రావడం గమనించినట్టు తెలుస్తోంది. ఆ సమయంలో ఆరుగురు సిబ్బంది కూడా విమానంలో ఉన్నారు.
ప్రయాణికుల భద్రతే తమకు ముఖ్యమని, ఢిల్లీ బయలుదేరిన విమానంలో స్మోక్ అలర్ట్తో లఖ్నవూలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసినట్టు ఎయిరిండియా ఎక్స్ప్రెస్ ప్రతినిధి తెలిపారు. ప్రయాణికులందరూ క్షేమమేనని, విమానం దిగగానే వారందరికీ రిఫ్రెష్మెంట్ ఏర్పాటు చేశామని, ప్రత్యేక విమానంలో వారిని ఢిల్లీకి పంపుతున్నామని చెప్పారు. ప్రయాణికులకు ఏర్పడిన అసౌకర్యానికి చింతిస్తున్నామని అన్నారు. కాగా, ఘటన అనంతరం విమానాన్ని 'ఎయిర్క్రాఫ్ట్ ఆన్ గ్రౌండ్'గా ప్రకటించి పూర్తిస్థాయి తనిఖీలు చేపట్టారు. అవసరమైన మరమ్మతుల అనంతరం తిరిగి ప్రయాణం సాగించనుంది.
ఇవి కూడా చదవండి..
రేపటి నుంచే మార్పులు.. మీ పాకెట్పై ప్రభావం చూపించే అంశాలు!
బీహార్ ఆలయంలో తొక్కిసలాట.. 8 మంది మృతి..