Share News

ఘనంగా 'హర్ ఘర్ తిరంగా' వేడుకలు

ABN , Publish Date - Aug 09 , 2026 | 02:48 PM

గుజరాత్ లోని దీన్ దయాళ్ పోర్ట్ అథారిటీ ఆధ్వర్యంలో గాంధీధామ్‌లోని గోపాల్‌పురి పోర్ట్ టౌన్‌షిప్‌లో 'హర్ ఘర్ తిరంగా' వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా నిర్వహించిన 'తిరంగా యాత్ర' పౌరులలో దేశభక్తి స్ఫూర్తిని, ఐక్యతను నింపింది.

ఘనంగా 'హర్ ఘర్ తిరంగా' వేడుకలు
‘Har Ghar Tiranga’ Celebrations with Tiranga Yatra

గాంధీధామ్ (గుజరాత్), ఆగస్టు 9: కాండ్లాలోని దీన్‌దయాళ్ పోర్ట్ అథారిటీ (DPA) ఇవాళ (ఆదివారం) గాంధీధామ్‌లోని గోపాల్‌పురి పోర్ట్ టౌన్‌షిప్‌లో 'తిరంగా యాత్ర'ను ప్రారంభించింది. పోర్ట్ ఉన్నతాధికారుల సమక్షంలో DPA చైర్మన్ సుశీల్ కుమార్ సింగ్ (IRSME) ఈ యాత్రకు నాయకత్వం వహించారు. DPA అధికారులు, ఉద్యోగులు, CISF సిబ్బంది, పాఠశాల విద్యార్థులు, దీన్‌దయాళ్ మహిళా శక్తి కేంద్రం (DMSK) సభ్యులు, భద్రతా సిబ్బంది, సాధారణ ప్రజలు ఇందులో పాల్గొని, దేశభక్తిని చాటారు.


త్రివర్ణ రంగులతో అలంకరించిన, దేశభక్తి ఉత్సాహంతో నిండిన పోర్ట్ టౌన్‌షిప్ ఒక అద్భుతమైన దృశ్యాన్ని ఆవిష్కరించింది. జాతీయ జెండాలు చేతబూని పాల్గొన్న జనసందోహంతో టౌన్‌షిప్ ప్రాంగణమంతా దేశభక్తి శోభతో విలసిల్లింది. 'వందేమాతరం' నినాదాలు, దేశభక్తి కేరింతలతో ఆ ప్రాంతం హోరెత్తింది. పాల్గొన్నవారు యాత్ర అంతటా జాతీయ జెండాను గర్వంగా చేతబూని నడిచారు. దేశం పట్ల గర్వం, ఐక్యత, అంకితభావం ప్రతిబింబించేలా, దేశభక్తి నినాదాలు 'వందేమాతరం' స్ఫూర్తితో ఆ ప్రాంతమంతా మార్మోగింది.


మువ్వన్నెల జెండాను కేవలం ఒక జాతీయ చిహ్నంగానే కాకుండా, భారతదేశ ఐక్యత, సార్వభౌమాధికారం, ఉమ్మడి జాతీయ గుర్తింపునకు ప్రతీకగా నిర్వహించడమే ఈ ప్రచార ముఖ్య ఉద్దేశం. ప్రధాని నరేంద్ర మోదీ 2022లో 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' నేపథ్యంలో ఈ పిలుపునిచ్చారు. పౌరులు తమ ఇళ్లపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి, జాతీయ జెండాతో ఆత్మీయ అనుబంధాన్ని పెంచుకోవడానికి, స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకోవడానికి ఇది దోహదపడుతుంది.


ఈ ఏడాది 'వందేమాతరం' 150 సంవత్సరాల వేడుకలు పురస్కరించుకుని దేశవ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జిల్లా, బ్లాక్, పంచాయతీ స్థాయిల్లో తిరంగా ర్యాలీలు, ప్రదర్శనలు, సైకిల్/బైక్ ర్యాలీలు, కాన్సర్ట్‌లు, రంగోలీ పోటీలు నిర్వహించబోతున్నారు.


'తిరంగా సెల్యూట్ టు ది స్పిరిట్ ఆఫ్ వందేమాతరం' థీమ్‌తో ప్రత్యేక ప్రదర్శనలు 'సెల్ఫీ విత్ తిరంగా' డ్రైవ్ చేపట్టబోతున్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, ఇళ్లపై జాతీయ జెండా ఆవిష్కరణ, ప్రముఖ ప్రాంతాలలో మువ్వన్నెల విద్యుత్ కాంతుల అలంకరణ ఈ పంద్రాగస్టున మరింతగా ఆకర్షించబోతున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి..

ఆదివాసీల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యం: సీఎం చంద్రబాబు

భాగ్యనగర మహిళలకు బోనాల పండుగ శుభాకాంక్షలు: కేటీఆర్

Updated Date - Aug 09 , 2026 | 03:17 PM