Share News

ఉద్యమంపై ఉక్కుపాదం!

ABN , Publish Date - Jul 24 , 2026 | 06:04 AM

రాజధాని ఢిల్లీలో సీజేపీ నిరసన ప్రదర్శనల్లో పాల్గొన్న వారిపై పోలీసులు కఠిన చర్యలకు సిద్ధమవుతున్నారు. హింసకు పాల్పడ్డ వారి పాస్‌పోర్టులు రద్దు చేయాలని భావిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీ, వీడియోల...

ఉద్యమంపై ఉక్కుపాదం!

  • ఆందోళనకారులపై ఎన్‌ఎ్‌సఏ చట్టం కింద చర్యలు

  • కేసు నమోదు చేయకుండానే 12 రోజుల నుంచి 12 నెలలపాటు నిర్బంధించే అవకాశం

  • సాధారణ ప్రక్రియే.. ఆందోళనతో ముడిపెట్టొద్దు: ఢిల్లీ పోలీస్‌!

  • ఆందోళనల్లో హింసకు పాల్పడ్డ వారి పాస్‌పోర్టుల రద్దు!

  • డ్రగ్స్‌ కేసులో ఇరికిస్తానన్న ముంబై పోలీసుపై వేటు

  • చచ్చిన బొద్దింకను ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసి.. సీజేపీపై కామెంట్లు

  • సీఆర్‌పీఎఫ్‌ కమాండెంట్‌ సోనియా సెహ్రావత్‌పై చర్య?

  • విద్యార్థులను ఆందోళనల వైపు వెళ్లనివ్వొద్దు!

  • వర్సిటీల వీసీలకు ఏఐయూ లేఖ

న్యూఢిల్లీ, జూలై 23: రాజధాని ఢిల్లీలో సీజేపీ నిరసన ప్రదర్శనల్లో పాల్గొన్న వారిపై పోలీసులు కఠిన చర్యలకు సిద్ధమవుతున్నారు. హింసకు పాల్పడ్డ వారి పాస్‌పోర్టులు రద్దు చేయాలని భావిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీ, వీడియోల ఆధారంగా.. ఆందోళనలో పాల్గొన్న వారిని గుర్తించి వారిపై జాతీయ భద్రతా చట్టం(ఎన్‌ఎ్‌సఏ) కింద నిర్భంధ అధికారాలను వినియోగించుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. ఎన్‌ఎ్‌సఏ చట్టం ప్రకారం ఢిల్లీ పోలీస్‌ కమిషనర్‌కు ప్రత్యేక అధికారాలు కల్పిస్తూ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ ఉత్తర్వు జారీచేస్తారు. దాని ప్రకారం 12 రోజుల నుంచి 12 నెలలపాటు ముందస్తుగా నిర్బంధించే అధికారం పోలీసులకు కలుగుతుంది. ఈ మేరకు.. జూలై 19 నుంచి అక్టోబర్‌ వరకు మూడు నెలల పాటు ఈ ఆదేశాలు అమల్లో ఉండేలా ఈ నెల 15వ తేదీనే లెఫ్టినెంట్‌ గవర్నర్‌ ఆదేశాలు జారీచేశారు. ఈ చట్టం కింద అదుపులోకి తీసుకున్న వ్యక్తులకు న్యాయపోరాటం చేసే వెసులుబాటు పరిమితంగా ఉంటుంది. అయితే, విద్యార్థి నిరసనలను అణచివేసేందుకే ఈ ఉత్తర్వులు ఇచ్చారంటూ వస్తున్న వార్తలను ఢిల్లీ పోలీసులు ఖండించారు. ప్రతి మూడు నెలలకోసారి జరిగే సాధారణ పునరుద్ధరణ(రొటీన్‌ ఎక్స్‌టెన్షన్‌) ప్రక్రియేనని, ప్రస్తుత ఆందోళనలతో సంబంధం లేదని పేర్కొన్నారు. మరోవైపు, సీజేపీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఆందోళనకు మద్దతుగా ముంబైలో నిరసన చేస్తున్న విద్యార్థులను ఓ పోలీస్‌ అధికారి బహిరంగంగా బెదిరించిన వీడియో తీవ్ర చర్చనీయాంశమైంది. ‘‘నిరసనలో మళ్లీ ఎక్కడైనా కన్పిస్తే మీ జేబుల్లో డ్రగ్స్‌ పెట్టి దొంగ కేసు పెడ తా. ఇక జీవితంలో బెయిల్‌ రాదు’’ అంటూ విద్యార్థులను హెచ్చరిస్తున్నట్లుగా ఆ వీడియోలో ఉంది. దాదాపు 25 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోపై స్పందించిన ముంబై పోలీసులు.. సదరు పోలీస్‌ డ్రైవర్‌పై విచారణకు ఆదేశించడంతో పాటు విధుల నుంచి తప్పించారు. కాగా, జూలై 20న ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద జరిగిన చేపట్టిన ఆందోళన సందర్భంగా గాయపడ్డ ర్యాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌ అసిస్టెంట్‌ కమాండెంట్‌ సోనియా సెహ్రావత్‌ వివాదంలో చిక్కుకున్నారు.


ఆందోళనల అనంతరం ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌ పోస్టులో సీజేపీని ఉద్దేశిస్తూ ఓ చనిపోయిన బొద్దింక ఫొటోను పోస్ట్‌ చేసి.. ‘ఇవి దేశాన్ని మారుస్తాయా’ అని కామెంట్‌ చేశారు. ఆ పోస్టు క్షణాల్లో వైరల్‌ కాగా.. విధుల్లో ఉన్న భద్రతా సిబ్బంది తన వ్యక్తిగత అభిప్రాయాలను సోషల్‌ మీడియాలో పెట్టడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఆ స్టోరీని సోనియా డిలీట్‌ చేశారు. ఈ ఘటనపై సోనియా సెహ్రావత్‌ నిబంధనలు ఉల్లంఘించినట్లు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని పేర్కొన్న సీఆర్‌పీఎఫ్‌ వర్గాలు.. ఈ వ్యవహారంపై ఆమె నుంచి త్వరలోనే వివరణ కోరనున్నట్లు సమాచారం. గాయం కారణంగా ప్రస్తుతం విధుల నుంచి విరామంలో ఉన్న సోనియాకు.. ఇన్‌స్టాలో 6.5 లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు.

ఎన్‌ఐఏ విచారణకు డిమాండ్‌

సీజేపీ చేపట్టిన ఆందోళనపై విచారణ జరిపించాలని కోరుతూ దాఖలైన ప్రజాప్రయోజన పిటిషన్‌ను అత్యవసరంగా విచారించేందుకు ఢిల్లీ హైకోర్టు అంగీకరించింది. చీఫ్‌ జస్టిస్‌ డీకే ఉపాధ్యాయ, తేజస్‌ కారియాల ధర్మాసనం ఈ పిటిషన్‌ను శుక్రవారం విచారించనుంది. విద్యార్థుల ఆందోళనగా ప్రారంభమైన నిరసనల్లో ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్తులను ధ్వంసం చేయడం, పోలీసులపై దాడి వంటి తీవ్రమైన నేరాలు జరిగాయని పిటిషనర్‌ సతీశ్‌ కుమార్‌ అగర్వాల్‌ ఆరోపించారు. ఆందోళన పేరుతో ఢిల్లీలోని రహదారులను మూసేసి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని, దీని వెనక విదేశీ నిధులు పొందే సంస్థలు, రాజకీయ శక్తుల కుట్ర దాగి ఉందని, అవసరమైనతే నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ(ఎన్‌ఐఏ)తో నిష్పాక్షిక విచారణ జరిపించాలని కోరారు.

కోర్టులను ఆయుధాలుగా వాడుకోవద్దు: సౌరవ్‌ దాస్‌

స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం న్యాయస్థానాలను ఆయుధాలుగా మార్చుకోకుండా కోర్టులే స్వయంగా అడ్డుకట్ట వేయాలని సీజేపీ ఆధికార ప్రతినిధి సౌరవ్‌ దాస్‌ విజ్ఞప్తి చేశారు. ఎన్‌ఐఏ విచారణ కోరుతూ దాఖలైన ప్రజా ప్ర యోజన వ్యాజ్యంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చే శారు. ఆందోళన కారులతో చర్చలు జరపాల్సింది పోయి.. యువతను చెడుగా చిత్రీకరించి, వారి గళాన్ని నొక్కేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆయన ఎక్స్‌ వేదికగా మండిపడ్డారు.

ఈ వార్తలనూ చదవండి:

ఇన్‌స్టా స్టోరీలో 'కాక్రోచ్' పోస్ట్.. వివాదంలో ఆర్ఏఎఫ్ ఆఫీసర్ సోనియా!

ప్రధాని నివాసం ముందు కాంగ్రెస్ నిరసన.. వాంగ్‌చుక్ భార్య విమర్శలు

Updated Date - Jul 24 , 2026 | 06:04 AM