‘చలో పార్లమెంట్' పిటిషన్పై తప్పుడు ప్రచారం.. మీడియా వార్తలను ఖండించిన సీజేఐ
ABN , Publish Date - Jul 24 , 2026 | 05:00 PM
'చలో పార్లమెంట్' నిరసనల సందర్భంగా పోలీసుల వ్యవహారంపై దాఖలైన అత్యవసర పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించిందంటూ వెలువడిన వార్తలను భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఖండించారు.
న్యూఢిల్లీ, జులై 24: 'చలో పార్లమెంట్' నిరసనల సందర్భంగా పోలీసుల వ్యవహారంపై దాఖలైన అత్యవసర పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించిందంటూ వెలువడిన వార్తలను భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఖండించారు. అలాంటి కథనాలు పూర్తిగా అవాస్తవమని, బాధ్యతారాహిత్యంగా తప్పుడు వార్తలు ప్రచారం చేశారని మీడియాపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
కోర్టు విచారణల ఆడియో-వీడియో రికార్డింగ్లను సామాజిక మాధ్యమాలలో అనధికారికంగా పోస్ట్ చేయడం, షేర్ చేయడంపై దాఖలైన పిల్పై సుప్రీంకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. విచారణ సందర్భంగా.. 'చలో పార్లమెంట్' ఆందోళనలకు సంబంధించి అత్యవసర పిటిషన్ను కోర్టు స్వీకరించలేదన్న వార్తలపై సీజేఐ సూర్యకాంత్ స్పందించారు.
సీజేఐ సూర్యకాంత్ మాట్లాడుతూ.. ‘శుక్రవారం ఉదయం 10 గంటల వరకు 'చలో పార్లమెంట్' ఆందోళనలకు సంబంధించి ఒక్క పిటిషన్ కూడా దాఖలు కాలేదు. ఒక న్యాయవాది విచారణ చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. కేవలం మౌఖిక అభ్యర్థనను పిటిషన్గా ఎలా పరిగణిస్తాం?. పిటిషన్ దాఖలైందంటూ గత రెండు రోజులుగా తప్పుడు ప్రచారం జరుగుతోంది. మీడియా ఎలాంటి బాధ్యత లేకుండా.. చీఫ్ జస్టిస్ ఆ పిటిషన్ను విచారణకు స్వీకరించడానికి నిరాకరించారంటూ తప్పుడు కథనాలు ప్రసారం చేసింది. పిటిషన్ లేకుండానే సుప్రీంకోర్టు తిరస్కరించిందని ప్రచారం చేయడం సరికాదు’ అంటూ మండిపడ్డారు.
ఇవి కూడా చదవండి
కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు.. గుంతకల్లు-బళ్లారి 3, 4వ రైల్వే లైన్కు గ్రీన్ సిగ్నల్
అందుకే ఆర్ఆర్తో నా ప్రయాణాన్ని ముగించాను: సంజు శాంసన్