నాపై వస్తున్న ఆరోపణలు నమ్మొద్దు.. రామభక్తులకు చంపత్ రాయ్ లేఖ
ABN , Publish Date - Jul 07 , 2026 | 07:08 PM
తనపై వస్తున్న ఆరోపణలను నమ్మవద్దని రామ భక్తులకు అయోధ్య రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ మాజీ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్ విజ్ఞప్తి చేశారు.
ఢిల్లీ, జులై 7 (ఆంధ్రజ్యోతి): తనపై వస్తున్న ఆరోపణలను నమ్మవద్దని రామ భక్తులకు అయోధ్య రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ (Ram Janmabhoomi Teerth Kshetra Trust) మాజీ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్ (Champat Rai) విజ్ఞప్తి చేశారు. రామ జన్మభూమి ఆలయ ప్రాంగణంలోని విరాళాల పెట్టె (డొనేషన్ బాక్స్) నగదు లెక్కింపు సమయంలో దొంగతనం జరిగిందనే ప్రచారం నేపథ్యంలో తనపై వ్యక్తిగతంగా చేస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు.
ఈ మేరకు చంపత్ రాయ్ రామ భక్తులకు బహిరంగ లేఖ రాశారు. తనపై వస్తున్న వ్యక్తిగత ఆరోపణలన్నీ పూర్తిగా నిరాధారమైనవని పేర్కొంటూ వాటిని తోసిపుచ్చారు. ఈ వ్యవహారంపై ఇప్పటివరకు ఉద్దేశపూర్వకంగానే మౌనం పాటించానని, దర్యాప్తు పూర్తికాకముందే స్పందించడం సముచితం కాదని భావించానని తెలిపారు.
రామ మందిర విరాళాల దొంగతనం వ్యవహారంపై ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) తుది నివేదిక సమర్పించిన అనంతరం ప్రస్తుతం ప్రచారంలో ఉన్న ప్రతి అంశానికి తానే స్వయంగా వరుస క్రమంలో సమాధానం ఇస్తానని చంపత్ రాయ్ స్పష్టం చేశారు. దర్యాప్తు పూర్తయిన తర్వాత పూర్తి సత్యాలు వెలుగులోకి వస్తాయని, అప్పటి వరకు భక్తులు ఎలాంటి అపోహలు, అసత్య ప్రచారాలను నమ్మవద్దని కోరారు.
అలాగే తాను అక్టోబర్ 1991 నుంచి అయోధ్యలో సేవలు అందిస్తున్నానని, తన 45 ఏళ్ల ప్రచారక్ జీవితంలో పారదర్శకత, నిబద్ధతతో పనిచేశానని పేర్కొన్నారు. తన జీవితం ఎప్పుడూ ‘తెరిచిన పుస్తకం’ లాంటిదేనని, ప్రజల ముందే తన కార్యకలాపాలు కొనసాగాయని లేఖలో చంపత్ రాయ్ వివరించారు.
ఇటీవల రామ మందిర విరాళాల నిర్వహణపై వస్తున్న ఆరోపణలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో చంపత్ రాయ్ ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది. సిట్ దర్యాప్తు నివేదిక వెలువడిన తర్వాత ఈ వ్యవహారంపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
ఈ వార్తలు కూడా చదవండి...
కేసీఆర్.. తెలంగాణకు చేసిన పాపాన్ని అసెంబ్లీ సాక్షిగా కడుక్కోవాలి: మంత్రి పొంగులేటి
కాళేశ్వరం పేరుతో కేటీఆర్ డ్రామాలు చేస్తున్నారు.. మంత్రి సీతక్క ఎద్దేవా
Read Latest Telangana News And And National News
And Telugu News