Share News

ఇంధన సమస్యల పర్యవేక్షణకు కేంద్ర మంత్రులతో కమిటీ

ABN , Publish Date - Mar 27 , 2026 | 05:15 PM

పశ్చిమాసియాలో యుద్ధంతో దేశంలో గ్యాస్, క్రూడ్ ఆయిల్ సరఫరాలో సమస్యలు తలెత్తుతున్న నేపథ్యంలో కేంద్ర కీలక నిర్ణయం తీసుకుంది. సమస్యలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు కేంద్ర మంత్రులతో ఒక కమిటీని ఏర్పాటు చేసింది.

ఇంధన సమస్యల పర్యవేక్షణకు కేంద్ర మంత్రులతో కమిటీ
Rajnath Singh

న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో యుద్ధంతో దేశంలో గ్యాస్, క్రూడ్ ఆయిల్ సరఫరాలో సమస్యలు తలెత్తుతున్న నేపథ్యంలో కేంద్ర కీలక నిర్ణయం తీసుకుంది. సమస్యలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు కేంద్ర మంత్రులతో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ ఈ కమిటీకి నేతృత్వం వహిస్తారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పురి ఇందులో సభ్యులుగా ఉంటారు.


మరోవైపు సామాన్య, మధ్యతరగతి ప్రజలపై ఎలాంటి భారం పడకుండా పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాలను కేంద్రం తగ్గించింది. పెట్రోల్‌పై సుంకాన్ని లీటరుకు రూ.13 నుంచి రూ.3కు తగ్గించింది. లీటరుకు రూ.10గా ఉన్న డీజిల్ ఎక్సైజ్ సుంకాన్ని పూర్తిగా రద్దు చేసింది. హోర్ముజ్ జలసంధి మూసివేత భయాలు, మధ్యప్రాచ్య దేశాల మధ్య కొనసాగుతున్న యుద్ధంతో అంతర్జాతీయంగా చమురు సరఫరాకు అవాంతరాలు తలెత్తుతున్నాయి. పెరిగిన దిగుమతి వ్యయాన్ని తట్టుకుని చమురు సంస్థల రికవరీకి తాజాగా కేంద్రం తీసుకున్న చర్య ఉపయోగపడుతుంది.


మరోవైపు, దేశవ్యాప్తంగా రిటైల్ ఔట్‌లెట్స్ యథాప్రకారం పనిచేస్తున్నాయని, అన్ని పంపుల్లోనూ తగినన్ని పెట్రోల్, డీజిల్ స్టాక్‌లు ఉన్నాయని పెట్రోలియం, నేచురల్ గ్యాస్ మంత్రిత్వ శాఖ ఒక అధికారిక ప్రకటనలో పేర్కొంది. వదంతులు నమ్మవద్దని, ప్యానిక్ కొనుగోళ్లకు పాల్పడవద్దని వినియోగదారులను కోరింది.


ఇవి కూడా చదవండి..

ఎరువుల కొరత లేదు, ఆందోళన వద్దు: లోక్‌సభలో జేపీ నడ్డా

ముఖ్యమంత్రి పదవికి 30న నితీశ్ రాజీనామా

Updated Date - Mar 27 , 2026 | 06:14 PM