నీట్ పేపర్ లీక్.. అనువాదకుల ద్వారా ప్రశ్నలు బహిర్గతమైనట్టు గుర్తించిన సీబీఐ!
ABN , Publish Date - Jul 30 , 2026 | 09:55 PM
నీట్ పేపర్ లీక్కు సంబంధించి సీబీఐ దర్యాప్తులో పలు కీలక వివరాలు వెలుగులోకి వచ్చాయి.
ఇంటర్నెట్ డెస్క్: నీట్ పేపర్ లీక్కు సంబంధించి సీబీఐ దర్యాప్తులో పలు కీలక వివరాలు వెలుగులోకి వచ్చాయి. పేపర్ను సెట్ చేసే వారికే ప్రశ్నలను మరో భాషలోకి అనువదించే బాధ్యతలు అప్పగించడంతో పేపర్ లీక్కు అవకాశం ఏర్పడిన విషయాన్ని సీబీఐ అధికారులు గుర్తించినట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న కెమిస్ట్రీ టీచర్ పీవీ కులకర్ణీ, ఫిజిక్స్ టీచర్ మనీషా మంధారే, బయాలజీ టీచర్ మనీషా హవాల్దార్ పేపర్ సెట్టింగ్ బాధ్యతలు నిర్వహించారు. ఈ ప్రశ్నలను మరాఠీలోకి అనువదించే బాధ్యతను కూడా వీరికే అప్పగించినట్టు తెలిసింది. దీంతో, వారికి తమ పథకాన్ని అమలు చేసేందుకు ఎక్కువ సమయం చిక్కినట్టు తెలిసింది.
మీడియా కథనాల ప్రకారం, ప్రశ్న పత్రం తయారీలో పాలుపంచుకున్న వ్యక్తులు ఆ తరువాత ఇంటికి వెళ్లి యథాప్రకారం కోచింగ్ క్లాసులను నిర్వహించేందుకు, తమ అధికారిక విధులు నిర్వహించేందుకు అనుమతి ఉంది. ఈ సందర్భంగా నిందితులు తమకు ముఖ్యమైనవిగా అనిపించిన కొన్ని ప్రశ్నలను గుర్తుపెట్టుకుని ఆ తరువాత కోచింగ్ సెంటర్లలోని తమ విద్యార్థులతో పంచుకున్నట్టు తెలిసింది. అయితే, ఇవి నీట్ ప్రశ్న పత్రంలోనివేనన్న విషయాన్ని మాత్రం విద్యార్థుల వద్ద గోప్యంగా ఉంచారని సమాచారం.
ఈ కేసులో నిందితురాలిగా ఉన్న మనీషా వాఘ్మారే విద్యార్థుల నుంచి ఈ ప్రశ్నలను సేకరించారు. వీటిని టైప్ చేసి పీడీఎఫ్గా మార్చి ధనుంజయ్ లోఖండేకు విక్రయించారు. అతడు తన నెట్వర్క్ ద్వారా వివిధ రాష్ట్రాల్లోని వారికి కొన్ని లక్షల రూపాయలకు విక్రయించినట్టు అధికారులు గుర్తించారు.
ఈ వార్తలనూ చదవండి:
‘గోమూత్ర నిపుణుడు’ అంటూ వ్యాఖ్య.. ప్రియాంక గాంధీకి విద్యావేత్తల ఘాటు లేఖ
యాంటీ పేపర్ లీక్ బిల్లుకు రాజ్యసభ ఆమోదం