ఢిల్లీ మద్యం పాలసీ కేసు.. దిగువ కోర్టు తీర్పుపై హైకోర్టులో సీబీఐ పిటిషన్
ABN , Publish Date - Feb 27 , 2026 | 07:30 PM
ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణంలో దిగువ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సీబీఐ సవాలు చేసింది. హైకోర్టులో పిటిషన్ వేసింది. తక్షణం పిటిషన్పై విచారణ జరపాలని కోర్టును కోరింది.
న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం పాలసీ కేసు మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా మరో 21 మంది నిందితులకు రౌస్ అవెన్యూ కోర్టు శుక్రవారంనాడు క్లీన్ చిట్ ఇచ్చింది. కేసు నుంచి వారిని విముక్తులను చేసింది. అయితే దీనిపై వెంటనే సీబీఐ (CBI) చర్యలకు దిగింది. దిగువ కోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ హైకోర్టు (Delhi High Court)లో పిటిషన్ వేసింది. తక్షణం పిటిషన్పై విచారణ జరపాలని కోర్టును కోరింది.
ఈ కేసులో రౌస్ ఎవెన్యూ కోర్టు శుక్రవారంనాడు కీలక తీర్పు ఇచ్చింది. సీబీఐ చార్జిషీటులో మెరిట్ లేదని పేర్కొంది. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, ఉప ముఖ్యమంత్రి సిసోడియా తదితరులకు క్లీన్చిట్ ఇచ్చింది. వీరు తప్పు చేసినట్టు సాక్ష్యాధారాలు లేవని కోర్టు స్పష్టం చేసింది. కేసు నుంచి నిందితులకు విముక్తి కల్పించింది.
సత్యం సాధించిన చారిత్రక విజయంగా ఈ తీర్పును 'ఆప్' అభివర్ణించింది. తీర్పు అనంతరం భావోద్వేగానికి గురైన అరవింద్ కేజ్రీవాల్.. ఆప్ను అంతం చేసేందుకు తప్పుడు మద్యం కుంభకోణం పేరుతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్షా కుట్ర పన్నారని, తన ప్రతిష్టపై దాడి చేశారని ఆరోపించారు. ఢిల్లీలో మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని ప్రధానమంత్రికి సవాలు విసిరారు. పదికి పైగా సీట్లను బీజేపీ గెలిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని అన్నారు. మరోవైపు, దిగువ కోర్టు తీర్పుపై బీజేపీ స్పందించింది. కేసులో కొన్ని సాంకేతిక కారణాల ఉన్నాయని, అంతమాత్రాన ఇంతటితో లీగల్ బ్యాటిల్ ముగిసినట్టు కాదని వ్యాఖ్యానించింది.
ఇవి కూడా చదవండి..
ఢిల్లీ మద్యం పాలసీ కేసు.. కేజ్రీవాల్కు భారీ ఊరట.
ఢిల్లీలో మళ్లీ ఎన్నికలు పెట్టండి... మోదీకి కేజ్రీవాల్ సవాల్