Share News

దిశా సాలియాన్‌ మృతి కేసు.. సీబీఐ దర్యాప్తునకు బాంబే హైకోర్టు ఆదేశం

ABN , Publish Date - Sep 03 , 2026 | 06:08 AM

దివంగత బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌ మాజీ మేనేజర్‌ దిశా సాలియాన్‌ మృతి కేసులో సీబీఐ దర్యాప్తునకు బాంబే హైకోర్టు బుధవారం ఆదేశించింది. ఈ కేసు దర్యాప్తులో ముంబై పోలీసులు...

దిశా సాలియాన్‌ మృతి కేసు.. సీబీఐ దర్యాప్తునకు బాంబే హైకోర్టు ఆదేశం

  • ఆరేళ్లుగా ఎఫ్‌ఐఆర్‌ ఎందుకు నమోదు

చేయలేదంటూ పోలీసులపై తీవ్ర ఆగ్రహం

ముంబై, సెప్టెంబరు 2: దివంగత బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌ మాజీ మేనేజర్‌ దిశా సాలియాన్‌ మృతి కేసులో సీబీఐ దర్యాప్తునకు బాంబే హైకోర్టు బుధవారం ఆదేశించింది. ఈ కేసు దర్యాప్తులో ముంబై పోలీసులు తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించారని.. గత ఆరేళ్లుగా ఎఫ్‌ఐఆర్‌ కూడా నమోదు చేయలేదంటూ ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. దీన్ని ప్రమాదవశాత్తు మరణంగా ఎలా పరిగణిస్తారని పోలీసులను ప్రశ్నించింది. వారి దర్యాప్తు తీరు చూస్తుంటే సమాధానాల కన్నా ఎక్కువ సందేహాలే వ్యక్తమవుతున్నాయని ఆక్షేపించింది. ఈ కేసులో సీబీఐ దర్యాప్తు అవసరమని పేర్కొంటూ 44 పేజీల తీర్పును వెలువరించింది. 2020 జూన్‌ 8న ముంబైలోని మలాడ్‌లో ఓ నివాస భవనం పైనుంచి పడి దిశా సాలియాన్‌ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఆ తర్వాత వారం రోజులకే సుశాంత్‌సింగ్‌ తన ఇంట్లో మరణించడంతో.. ఈ రెండు ఘటనల మధ్య ఏదో సంబంధం ఉందంటూ తీవ్ర దుమారం రేగింది. ఈ నేపథ్యంలోనే తన కుమార్తెపై సామూహిక అత్యాచారం జరిపి హత్య చేశారంటూ కోర్టును ఆశ్రయించిన సతీశ్‌ సాలియాన్‌.. మాజీ సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రేపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని, సీబీఐ దర్యాప్తు చేపట్టాలని కోరారు. ఈ క్రమంలోనే సతీశ్‌ సాలియాన్‌ వాంగూల్మాన్ని నమోదు చేసి, ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలంటూ బాంబే హైకోర్టు సీబీఐని ఆదేశించింది.

ఈ వార్తలనూ చదవండి:

ఉక్రెయిన్‌పై రష్యా దాడిలో జగిత్యాల వాసి మృతి

వియన్నా మ్యూజియంలో భారీ దోపిడీ.. రూ.38 కోట్ల విలువైన వజ్రాల హారం చోరీ..

Updated Date - Sep 03 , 2026 | 06:08 AM