బిల్గేట్స్ AI సమ్మిట్ ప్రసంగం: ఉత్కంఠకు తెర.. స్పష్టతనిచ్చిన ఫౌండేషన్!
ABN , Publish Date - Feb 17 , 2026 | 01:07 PM
మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకులు, ప్రపంచ టెక్ దిగ్గజం బిల్ గేట్స్ ఢిల్లీలో జరుగుతోన్న 'ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026'లో పాల్గొంటున్నారా లేదా అనే విషయంపై గత 24 గంటలుగా తీవ్రమైన సందిగ్ధత నెలకొంది. దీనిపై ఇప్పుడు స్పష్టత వచ్చింది.
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 17: ప్రపంచ టెక్ దిగ్గజం బిల్ గేట్స్ ఢిల్లీ వేదికగా జరుగుతున్న అంతర్జాతీయ AI సమ్మిట్లో ప్రసంగిస్తారా? లేదా? అనే దానిపై నెలకొన్న సందిగ్ధతకు తెరపడింది. మీడియాలో వస్తున్న వార్తలను తోసిపుచ్చుతూ, ఆయన షెడ్యూల్ ప్రకారమే సదస్సుకు హాజరవుతారని బిల్ & మెలిండా గేట్స్ ఫౌండేషన్ స్పష్టం చేసింది. దీంతో బిల్గేట్స్ ఫిబ్రవరి 19, 2026 (గురువారం) ఉదయం గం. 11:50 నుండి గం. 12:02 వరకు న్యూఢిల్లీలోని భారత్ మండపం ప్లీనరీ హాల్ - Aలో షెడ్యూల్ ప్రకారమే ప్రసంగించబోతున్నారు.
అసలేం జరిగింది? (రాద్ధాంతం ఎందుకు?)
మంగళవారం ఉదయం సడన్గా సమ్మిట్ అధికారిక వెబ్సైట్ నుండి బిల్ గేట్స్ పేరు, ఫోటో మాయమయ్యాయి.. అంటూ జాతీయ, అంతర్జాతీయ మీడియాతో కథనాలు వచ్చాయి. దీంతో సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి. దీనికి ప్రధానంగా రెండు కారణాలు వినిపించాయి:
1. ఎప్స్టీన్ ఫైల్స్ వివాదం: అమెరికా కోర్టు ఇటీవల విడుదల చేసిన జెఫ్రీ ఎప్స్టీన్ (Jeffrey Epstein) పత్రాల్లో బిల్ గేట్స్ పేరు ఉండటం అంతర్జాతీయంగా దుమారం రేపింది. లైంగిక నేరగాడైన ఎప్స్టీన్తో గేట్స్కు ఉన్న పాత సంబంధాల నేపథ్యంలో, భారత్ ఆయనకు అధికారిక వేదికను కల్పించడంపై విపక్షాలు (ముఖ్యంగా ఎంపీ ప్రియాంకా చతుర్వేది వంటి వారు) విమర్శలు గుప్పించారు.
2. మీడియా కథనాలు: వివాదాల దృష్ట్యా ప్రభుత్వం ఆయన పేరును వెబ్సైట్ నుండి తొలగించిందని, ఆయన ప్రసంగం రద్దయిందని కొన్ని అంతర్జాతీయ, జాతీయ మీడియా సంస్థలు వార్తలు ఇచ్చాయి.
తాజా క్లారిటీ: ప్రసంగం ఖాయం!
అయితే, తాజా నివేదికల ప్రకారం గేట్స్ ఫౌండేషన్ ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ, 'బిల్ గేట్స్ AI ఇంపాక్ట్ సమ్మిట్కు హాజరవుతున్నారు.. ఆయన తన కీలక ప్రసంగాన్ని (Keynote Speech) నిర్ణీత సమయానికే ఇస్తారు' అని క్లారిటీ ఇచ్చారని తాజాగా జాతీయ మీడియాలో రాసుకొస్తున్నారు. ఎప్స్టీన్ ఫైల్స్ సెగ తగిలినప్పటికీ, బిల్ గేట్స్ తన గ్లోబల్ టెక్ లీడర్ ఇమేజ్తో సమ్మిట్లో స్పీచ్ ఇవ్వబోతున్నారని, ప్రసంగం నిలిపివేశారనేది కేవలం పుకారు మాత్రమేనని తాజా పరిణామాలు చెబుతున్నాయి.
వెబ్సైట్ నుండి పేరు తొలగింపు అనేది కేవలం టెక్నికల్ ఇష్యూనా లేక విమర్శల నుంచి తప్పించుకోవడానికి ప్రభుత్వం చేసిన ప్రయత్నమా అనేది ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. కానీ, ఆయన ఇండియాలోనే ఉండటం, నిన్ననే అమరావతిలో సీఎం చంద్రబాబుతో భేటీ అవ్వడం చూస్తుంటే సమ్మిట్కు హాజరుకావడం పక్కా అని తెలుస్తోంది.
ఇవన్నీ పక్కనపెడితే.. తాజాగా AI సమ్మిట్ వెబ్ సైట్లో బిల్గేట్స్ ప్రసంగం షెడ్యూల్ ప్రకారమే ఉన్నట్టు కనిపిస్తోంది.

సమ్మిట్ విశేషాలు:
న్యూఢిల్లీ లోని భారత్ మండపంలో ఈ సమ్మిట్ జరుగుతోంది. సామ్ ఆల్ట్మాన్ (OpenAI), సుందర్ పిచాయ్ (Google), బ్రాడ్ స్మిత్ (Microsoft) ఈ సదస్సుకు ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాలలో AI ప్రభావం, బాధ్యతాయుతమైన వినియోగానికి సంబంధించి ఈ సదస్సు దిశానిర్దేశం చేస్తోంది.

ఈ వార్తలు కూడా చదవండి:
నా వ్యక్తిగత జీవితాన్ని వివాద వస్తువుగా మార్చొద్దు!
ఆ 5 పంచాయతీలను తెలంగాణలో కలపండి
Read Latest Telangana News and National News