అరాచక పాలనకు అంతం తప్పదు
ABN , Publish Date - Apr 25 , 2026 | 06:19 AM
పశ్చిమబెంగాల్ ఎన్నికల ప్రచారంలో అధికార టీఎంసీ, ప్రతిపక్ష బీజేపీల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. బెంగాల్ను గత 15ఏళ్లుగా టీఎంసీ ప్రభుత్వం అడ్డగోలుగా...
పశ్చిమ బెంగాల్లో బీజేపీ ప్రభంజనం: మోదీ.. ఢిల్లీని కూడా జయిస్తానన్న మమత
బెంగాల్లోనే అధికారం కోల్పోతున్నారు ఢిల్లీకెలా వస్తారు.. అమిత్ షా కౌంటర్
పశ్చిమ బెంగాల్ ఎన్నికల ప్రచారంలో మోదీ, మమత, షా మాటల యుద్ధం
కోల్కతా, ఏప్రిల్ 24: పశ్చిమబెంగాల్ ఎన్నికల ప్రచారంలో అధికార టీఎంసీ, ప్రతిపక్ష బీజేపీల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. బెంగాల్ను గత 15ఏళ్లుగా టీఎంసీ ప్రభుత్వం అడ్డగోలుగా దోచుకుందని.. అవినీతి, చొరబాట్లతో రాష్ట్ర అస్తిత్వాన్నే దెబ్బతీశారంటూ ప్రధాని మోదీ విరుచుకుపడగా, బెంగాల్ విజయం తర్వాత ఢిల్లీని జయిస్తానని మమత సవాల్ విసిరారు. రెండోదశ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం దుమ్దుమ్, జాదవ్ పూర్ నియోజకవర్గాల్లో నిర్వహించిన బహిరంగసభల్లో మోదీ మాట్లాడుతూ.. బెంగాల్ ప్రజలు బీజేపీకి పట్టం కట్టాలని నిర్ణయించుకున్నారని పేర్కొన్నారు. తృణమూల్ ప్రభుత్వం సాగిస్తున్న అక్రమాలకు రాష్ట్రప్రజలు త్వరలోనే చరమగీతం పాడతారని, మహిళలకు భద్రత కల్పించలేని మమత సర్కారుకు గద్దె దిగే రోజులు దగ్గరపడ్డాయని హెచ్చరించారు. ఆర్జీకార్ మెడికల్ కాలేజీ ఘటనను ప్రస్తావిస్తూ, రాష్ట్రంలో మహిళల రక్షణ విషయంలో టీఎంసీ ఘోరంగా విఫలమైందని మండిపడ్డారు. ‘మహిళలు న్యాయం కోరితే, రాత్రిపూట బయటకు రావొద్దని చెబుతున్నారు.’ అంటూ సీఎంపై నిప్పులు చెరిగారు. బాధితురాలి తల్లిని బీజేపీ అభ్యర్థిగా నిలబెట్టడం ద్వారా, ఆ కుటుంబానికి అండగా ఉంటామని నిరూపించుకున్నామని చెప్పారు.
మమత శపథం.. అమిత్ షా కౌంటర్
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత, కేంద్రంలో బీజేపీని గ ద్దె దించి ఢిల్లీని జయిస్తానని మమతా బెనర్జీ శపథం చేశారు. చౌరంగీ ఎన్నికల ప్రచారంలో ఆమె మాట్లాడుతూ.. బీజేపీని ఓడించడానికి ప్రతిపక్షాలన్నింటినీ ఏకం చేస్తానని ప్రకటించారు. బీజేపీ పతనం ఇక్కడి నుంచే మొదలవుతుందని పేర్కొన్నారు. మరోవైపు, మమతా బెన ర్జీ వ్యాఖ్యలను అమిత్ షా కొట్టిపారేశారు. కోల్కతాలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో అధికారం పోగొట్టుకుని ఢిల్లీకెలా వస్తారంటూ ఎద్దేవా చేశారు. టీఎంసీ ప్రజల నమ్మకాన్ని కోల్పోయిందని, ఓటమి భయంతోనే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. తొలిదశలో భాగంగా.. 152 సీట్లకు పోలింగ్ జరగ్గా, అందులో 110కి పైగా స్థానాల్లో బీజేపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
హుగ్లీ నదిలో
మోదీ పడవ ప్రయాణం
ఎన్నికల ప్రచారం కోలాహలం మధ్య.. మోదీ కోల్కతాలోని హుగ్లీ నదిలో పడవ ప్రయాణం చేస్తూ కొంతసేపు సరదాగా గడిపారు. నదిలో ప్రయాణిస్తున్న సమయంలో కెమెరా చేతబట్టి.. హౌరాబ్రిడ్జి, విద్యాసాగర సేతు దృశ్యాలను ఫొటోలు తీశారు. ‘‘గంగానదికి ఉపనది అయిన హుగ్లీ.. బెంగాల్ ఆత్మతో ప్రవహిస్తుందని, ఈ పవిత్రనదీ జలాలు గొప్ప నాగరికతకు ప్రతిబింబం’’ అని మోదీ ఎక్స్లో పోస్టు చేశారు. ఉదయాన్నే నదీ తీరానికి చేరుకున్న మోదీ అక్కడ పడవ నడిపేవారిని కలిసి వారి కష్టాలు అడిగి తెలుసుకున్నారు. ఉదయం నడకకు వచ్చిన వారితో గడపడం తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి...
ఆ వీడియోలతో బ్లాక్ మెయిల్.. హనీట్రాప్ ముఠా సంచలనం
శబరిమల కేసు విచారణలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
బాలికల కాలేజీలో కోఎడ్యుకేషన్ ఏర్పాటుపై హైకోర్టు అసంతృప్తి
Read Latest AP News And Telangana News And International News