బిచ్చగత్తె ఇంట్లో 3.50 లక్షల నగదు!
ABN , Publish Date - Aug 29 , 2026 | 07:25 AM
కర్ణాటక రాష్ట్రం మండ్య జిల్లాలో మరో బిచ్చగత్తె ఇంట మూటలు మూటలు నాణేలు, కరెన్సీ నోట్లు లభించాయి. ఈ నెల 22న మండ్య పట్టణంలో గుత్తలు కాలనీకి చెందిన వృద్ధురాలు నూరీ ఇంట్లో రూ.8 లక్షల నగదు లభించింది.
పది సంచుల్లో నాణేలు..రెండు సంచుల్లో నోట్లు
బెంగళూరు, ఆగస్టు 28 (ఆంధ్రజ్యోతి): కర్ణాటక రాష్ట్రం మండ్య జిల్లాలో మరో బిచ్చగత్తె ఇంట మూటలు మూటలు నాణేలు, కరెన్సీ నోట్లు లభించాయి. ఈ నెల 22న మండ్య పట్టణంలో గుత్తలు కాలనీకి చెందిన వృద్ధురాలు నూరీ ఇంట్లో రూ.8 లక్షల నగదు లభించింది. తాజాగా మండ్య జిల్లా శ్రీరంగపట్టణంలోని పూర్ణయ్యవీధిలో సావిత్రి అనే యాచకురాలి ఇంట్లోనూ పది సంచుల నాణేలు, రెండు సంచుల్లో నోట్లు అభించాయి. వృద్ధురాలైన సావిత్రి బిచ్చమెత్తుకుని జీవనం సాగిస్తున్నారు.
ఇంట్లో ఒక్కరే ఉంటున్న ఆమె. గురువారం ఇంటి నుంచి బయటకు రాకపోవడంతో స్థానికులు అనుమానంతో వెళ్లి చూశారు. అనారోగ్యంతో బాధపడుతున్నట్టు గుర్తించి, అవసరమైన ఆహారం, ఇతర సౌలభ్యాలు సమకూర్చారు. ఆ సమయంలో వృద్ధురాలి ఇంట్లో మూటలను గమనించి, వాటిని విప్పిచూశారు. సంచుల్లో నాణేలు, కరెన్సీ ఉండటంతో స్థానిక యువకులు రెండురోజులపాటు లెక్కించారు. మొత్తంగా రూ.3.50 లక్షలకుపైగా నగదు ఉన్నట్టు తేల్చారు. ఆ సొమ్మును ఆమె పేరిట బ్యాంకులో డిపాజిట్ చేయాలని స్థానికులు నిర్ణయించారు.