'మిషన్ 5 మిలియన్ ట్రీస్' కార్యక్రమానికి అమిత్ షా శ్రీకారం
ABN , Publish Date - Jul 12 , 2026 | 04:53 PM
పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా గుజరాత్లోని అహ్మదాబాద్లో సరికొత్త హరిత విప్లవం ప్రారంభమైంది. నగరం అంతటా 50 లక్షల మొక్కలను నాటడమే లక్ష్యంగా పెట్టుకున్న'మిషన్ 5 మిలియన్ ట్రీస్' కార్యక్రమాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రారంభించారు.
అహ్మదాబాద్ (గుజరాత్), జులై 12: పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా గుజరాత్లోని అహ్మదాబాద్లో ఇవాళ సరికొత్త హరిత విప్లవం ప్రారంభమైంది. అహ్మదాబాద్ నగరం అంతటా 50 లక్షల మొక్కలను నాటడమే లక్ష్యంగా పెట్టుకున్న'మిషన్ 5 మిలియన్ ట్రీస్' (Mission 5 Million Trees)కార్యక్రమాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధికారికంగా ప్రారంభించారు.
నగరంలోని సైన్స్ సిటీ ప్రాంతంలో జరిగిన ఈ సామూహిక ప్లాంటేషన్ డ్రైవ్ కార్యక్రమంలో ఆయన స్వయంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (AMC) చేపట్టిన పలు అభివృద్ధి పనులను ప్రారంభించడంతో పాటు, పలు ప్లాంటేషన్ ప్రాజెక్టులకు అమిత్ షా శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన AMTS బస్సులను కూడా జెండా ఊపి ప్రారంభించారు.
ప్రజల భాగస్వామ్యం కోసం ప్రత్యేక యాప్
ఈ పర్యావరణ ఉద్యమంలో సాధారణ ప్రజలను కూడా భాగస్వామ్యులను చేయడానికి AMC సరికొత్త వ్యూహాలను అమలు చేస్తోంది. 'AMC Seva' మొబైల్ అప్లికేషన్ ద్వారా 'గ్రీన్ వాలంటీర్', 'మెమోరియల్ పార్క్' వంటి వినూత్న కార్యక్రమాలను ప్రమోట్ చేస్తున్నారు.
ఇళ్ల వద్దే ఉచితంగా మొక్కలు నాటే సదుపాయం:
నివాస ప్రాంతాలను 'గ్రీన్ సొసైటీలు'గా మార్చడానికి ఒక ప్రత్యేక డ్రైవ్ను ప్రారంభించారు. తమ ఇళ్లలో లేదా సొసైటీ ఆవరణలో మొక్కలు నాటాలనుకునే పౌరులు 'AMC Seva' యాప్ ద్వారా రిజిస్టర్ చేసుకోవచ్చు. అలా రిజిస్టర్ చేసుకున్న వారి ఇళ్లకు అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ బృందాలు స్వయంగా వచ్చి ఉచితంగా మొక్కలు నాటుతాయని గుజరాత్ ముఖ్యమంత్రి కార్యాలయం (CMO) వెల్లడించింది.
Also Read:
వాణిజ్య నౌకపై ఇరాన్ దాడి.. భారతీయుడి గల్లంతు