Share News

ఏకే-203 ‘షేర్‌’ వచ్చేస్తోంది..!

ABN , Publish Date - Aug 24 , 2026 | 06:37 AM

భారత సైన్యం ప్రస్తుతం వాడుతున్న ఇన్‌సాస్‌ రైఫిల్స్‌ స్థానంలో అధునాతన ‘ఏకే-203’ రైఫిల్‌ ‘షేర్‌’ వచ్చి చేరనుంది. పూర్తి స్వదేశీయంగా తయారు చేసిన ఈ ఏకే-203 రైఫిల్‌ను విజయవంతంగా...

ఏకే-203 ‘షేర్‌’ 	వచ్చేస్తోంది..!

పూర్తి స్వదేశీ రైఫిల్‌ పరీక్ష విజయవంతం

పరీక్షల నిమిత్తం త్వరలోనే సైన్యానికి

అమేఠీ, ఆగస్టు 23: భారత సైన్యం ప్రస్తుతం వాడుతున్న ఇన్‌సాస్‌ రైఫిల్స్‌ స్థానంలో అధునాతన ‘ఏకే-203’ రైఫిల్‌ ‘షేర్‌’ వచ్చి చేరనుంది. పూర్తి స్వదేశీయంగా తయారు చేసిన ఈ ఏకే-203 రైఫిల్‌ను విజయవంతంగా పరీక్షించారు. ‘షేర్‌’ అని పిలిచే ఈ రైఫిళ్లను స్థానికంగా తయారు చేసేందుకు 2019లో భారత్‌, రష్యా మధ్య ‘ఇండో-రష్యన్‌ రైఫిల్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌’ (ఐఆర్‌ఆర్‌పీఎల్‌) ఏర్పాటైంది. ఐఆర్‌ఆర్‌పీఎల్‌ ఆధ్వర్యంలో ఉత్తరప్రదేశ్‌లోని అమేఠీ జిల్లా కోర్వా ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీలో వీటిని ఉత్పత్తి చేస్తున్నారు. ఈ రైఫిల్‌ తయారీకి అవసరమైన ప్రతిభాగం, ముడిసరుకును పూర్తిగా భారత్‌లోనే సేకరించారు. పరీక్ష సందర్భంగా రైఫిల్‌కు ట్రయల్స్‌ నిర్వహించామని.. ఫలితం ప్రోత్సాహకరంగా ఉందని ఐఆర్‌ఆర్‌పీఎల్‌ సీఈవో, ఎండీ మేజర్‌ జనరల్‌ కేఎస్‌ శర్మ తెలిపారు. ‘‘ఐఆర్‌ఆర్‌పీఎల్‌లో మా అందరికీ ఇది ఎంతో గర్వకారణమైన క్షణం. పూర్తిగా భారతీయ విడిభాగాలు, ముడిసరుకుతో తయారుచేసిన తొలి ఏకే-203 ‘షేర్‌’ రైఫిల్‌ను మేం విజయవంతంగా పరీక్షించాం’’ అని శర్మ చెప్పారు. త్వరలోనే మరిన్ని ప్రొటోటై్‌పలు సిద్ధం చేసి వాటిని సైనిక పరీక్షల కోసం సెప్టెంబరులో అప్పగించే అవకాశం ఉందన్నారు. ప్రతి 100 సెకన్లకు ఒక ఏకే-203 రైఫిల్‌ను తయారు చేసే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని వెల్లడించారు. ఏకే-203 అనేది కలాష్నికోవ్‌ ప్లాట్‌ఫామ్‌ ఆధారంగా రూపొందించిన గ్యాస్‌ ఆపరేటెడ్‌ 7.26్ఠ39 ఎంఎం అసాల్ట్‌ రైఫిల్‌. ఈ రైఫిల్‌తో నిమిషానికి 700రౌండ్లు కాల్చవచ్చు. దీని పరిధి సుమారు 800మీటర్లు. భారత సైనికులు ఇప్పటికే వాడుతున్న పాత ఇన్‌సాన్‌ రైఫిల్స్‌ స్థానంలో వీటిని ప్రవేశపెట్టనున్నారు. 6లక్షలకుపైగా ఏకే-203 రైఫిల్స్‌ను భారత్‌ సమకూర్చుకోనుంది.

ఈ వార్తలనూ చదవండి:

అమెరికాలో భారతీయ వ్యాపారి హత్య.. నిందితుడి చిత్రాలు విడుదల..

అమెరికా ఒత్తిడికి తలవంచబోం.. ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ కీలక వ్యాఖ్యలు..

Updated Date - Aug 24 , 2026 | 06:37 AM