అమెరికాలో భారతీయ వ్యాపారి హత్య.. నిందితుడి చిత్రాలు విడుదల..
ABN , Publish Date - Aug 23 , 2026 | 04:17 PM
భారతీయ వ్యాపారి సురేశ్ పటేల్ను హత్య చేసిన దోపిడీ దొంగ కోసం అమెరికా పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సిటీ ఆఫ్ జాక్సన్ పోలీసులు నిందితుడి చిత్రాలను సోషల్ మీడియాలో విడుదల చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: భారతీయ వ్యాపారి సురేశ్ పటేల్ను హత్య చేసిన దోపిడీ దొంగ కోసం అమెరికా పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సిటీ ఆఫ్ జాక్సన్ పోలీసులు నిందితుడి చిత్రాలను సోషల్ మీడియాలో విడుదల చేశారు. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను పంచుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గుజరాత్లోని మెహసానా జిల్లా ఆఖాజ్ గ్రామానికి చెందిన సురేశ్ పర్సోత్తమ్దాస్ పటేల్ (56) ఆగస్టు 20వ తేదీ రాత్రి జరిగిన దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. సురేశ్ దాదాపు 30 ఏళ్లుగా అమెరికాలోని చికాగోలో నివసిస్తున్నారు.
ఈ దారుణం జరగడానికి ఒక వారం ముందే ఆయన జాక్సన్ నగరంలో 'రిడ్జ్క్రెస్ట్ సెల్లార్స్' పేరుతో కొత్త వైన్ షాపును ప్రారంభించారు. 20వ తేదీ రాత్రి 9 గంటల సమయంలో మాస్క్ ధరించిన వ్యక్తి దుకాణంలోకి చొరబడ్డాడు. ఆయుధాన్ని చూపిస్తూ డబ్బులు ఇవ్వాలని క్యాషియర్ను బెదిరించాడు. క్యాషియర్ నుంచి డబ్బులు తీసుకున్న తర్వాత, సురేశ్ పటేల్పై పలుమార్లు కాల్పులు జరిపి పారిపోయాడు. కాల్పులు జరిగిన సమయంలో సురేశ్ పటేల్ పక్కన ఆయన కుమార్తె నిలబడి ఉంది.
ఆమె కళ్ల ముందే సురేశ్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనలో ఆమెకు ఎలాంటి గాయాలు కాలేదు. కాల్పుల సమయంలో చోటు చేసుకున్న గందరగోళం కారణంగా అక్కడ పనిచేస్తున్న 70 ఏళ్ల మహిళా ఉద్యోగి కిందపడిపోవడంతో ఆమె మణికట్టు విరిగింది. సీసీటీవీలో ఇందుకు సంబంధించిన దృశ్యాలు రికార్డు అయ్యాయి. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సీసీటీవీలో రికార్డైన నిందితుడి దృశ్యాలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఇవి కూడా చదవండి
నిజామాబాద్ అభివృద్ధే ధ్యేయం.. అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తాం: మహేశ్ కుమార్ గౌడ్
అంతర్జాతీయ, దేశవాళీ క్రికెట్కు కర్ణ్ శర్మ వీడ్కోలు