Share News

టెయిల్ స్ట్రైక్‌కు గురైన ఎయిరిండియా విమానం..

ABN , Publish Date - May 21 , 2026 | 04:08 PM

ఢిల్లీ నుంచి బెంగళూరుకు వెళ్లిన ఎయిరిండియా విమానం ల్యాండింగ్ సమయంలో టెయిల్ స్ట్రైక్‌కు గురైంది. విమానం తోక భాగం రన్‌వేకు తాకడంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.

టెయిల్ స్ట్రైక్‌కు గురైన ఎయిరిండియా విమానం..
Air India Tail Strike

బెంగళూరు: ఢిల్లీ నుంచి బెంగళూరుకు వెళ్లిన ఎయిరిండియా విమానం ల్యాండింగ్ సమయంలో టెయిల్ స్ట్రైక్‌కు గురైంది. విమానం తోక భాగం రన్‌వేకు తాకడంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అప్రమత్తంగా వ్యవహరించిన పైలెట్ సురక్షితంగా ల్యాండ్ చేశారు. తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడడంతో ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై ఎయిరిండియా అధికారికంగా వివరణ ఇచ్చింది.


'ఢిల్లీ నుంచి బెంగళూరుకు వెళ్లిన AI2651 ఎయిరిండియా విమానం టెయిల్ స్ట్రైక్‌కు గురైంది. ఆ సమయంలో ప్రయాణికులు, సిబ్బంది సహా మెుత్తం 179 మంది ఉన్నారు. ప్రస్తుతం ప్రయాణికులు, సిబ్బంది అంతా క్షేమంగానే ఉన్నారు. వారంతా సురక్షితంగా విమానం దిగి గమ్యస్థానాలకు చేరుకున్నారు. టెయిల్ స్ట్రైక్‌కు గురైన విమాన సేవల్ని తాత్కాలికంగా నిలిపివేశాం. ఈ ఘటనపై సంబంధిత అధికారులతో దర్యాప్తు జరుపుతున్నాం' అని ఎయిరిండియా తెలిపింది. కాగా, AI2651 విమాన సేవలు నిలిచిపోవడంతో బెంగళూరు నుంచి ఢిల్లీకి వెళ్లాల్సిన ప్రయాణికులకు అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు.


టెయిల్ స్ట్రైక్ అంటే..?

అంతర్జాతీయ విమాన రవాణా సంఘం (IATA) ప్రకారం.. టేకాఫ్, ల్యాండింగ్ సమయంలో విమానం తోక భాగం రన్‌వేను తాకినప్పుడు టెయిల్ స్ట్రైక్ ఏర్పడుతుంది. దీని ఫలితంగా విమానం నియంత్రణ కోల్పోవడం, రన్‌వే నుంచి పక్కకు వెళ్లడం వంటి పరిణామాలు చోటుచేసుకుంటాయి.


ఈ వార్తలు కూడా చదవండి

అప్పు గొడవ.. కారు బానెట్‌పై 500 మీటర్ల దూరం ఈడ్చుకెళ్లిన వ్యక్తి..

ప్రమాణస్వీకారం సందర్భంగా రాహుల్ గాంధీ ప్రస్తావన.. తమిళనాడు గవర్నర్ అభ్యంతరం

Updated Date - May 21 , 2026 | 04:25 PM