అసదుద్దీన్ ఒవైసీకి షాక్..!.. పక్క చూపులు చూస్తున్న ఏఐఎంఐఎం సీనియర్ నేత..
ABN , Publish Date - Sep 01 , 2026 | 07:55 PM
ఉత్తర్ప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు సమీపిస్తున్న వేళ ఏఐఎంఐఎం పార్టీ జాతీయ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీకి గట్టి షాక్ తగిలే సూచనలు కనిపిస్తున్నాయి. ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి సయ్యద్ అసిమ్ వకార్.. కాంగ్రెస్ పార్టీలో చేరుతారనే ఊహాగానాలు జోరందుకున్నాయి.
లక్నో: ఉత్తర్ప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు సమీపిస్తున్న వేళ ఏఐఎంఐఎం (AIMIM) పార్టీ జాతీయ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీకి గట్టి షాక్ తగిలే సూచనలు కనిపిస్తున్నాయి. ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి సయ్యద్ అసిమ్ వకార్.. కాంగ్రెస్ పార్టీలో చేరుతారనే ఊహాగానాలు జోరందుకున్నాయి. ఏఐఎంఐఎం యూపీ విభాగానికి సంబంధించిన నిర్ణయాల పట్ల అసిమ్ కొంతకాలంగా అసంతృప్తిగా ఉన్నారు. ఈ మేరకు ఢిల్లీలో బుధవారం కాంగ్రెస్ అగ్రనేతల సమక్షంలో పార్టీ మారుతారనే ప్రచారం ఊపందుకుంది.
ఏఐఎంఐఎంలో చేరకముందే సయ్యద్ అసిమ్ వకార్ దాదాపు 20 ఏళ్ల పాటు సమాజ్వాదీ పార్టీలో పని చేశారు. ఆ తర్వాత అసదుద్దీన్ ఒవైసీ గూటికి చేరి పదేళ్లుగా పార్టీకి సేవలందిస్తున్నారు. ఏఐఎంఐఎం జాతీయ అధికార ప్రతినిధిగా యూపీలో అసిమ్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కాగా, ఉత్తర్ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలను అసదుద్దీన్ ఒవైసీ ఈసారి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. యూపీలో గతం కంటే ఎక్కువ సీట్లు గెలుచుకోవాలని ప్రణాళికలు రచిస్తున్నారు. ఇలాంటి వేళ పార్టీ సీనియర్ నేత పక్క చూపులు చూడటంతో పార్టీ నేతల్లో ఆందోళన నెలకొంది. అయితే, కాంగ్రెస్లో చేరుకున్నారా..? అని పలువురు మీడియా ప్రతినిధులు అసిమ్ వకార్ను ప్రశ్నించగా.. దీనిని ఆయన ఖండించలేదు. దీంతో ఊహాగానాలు మరింత ఊపందుకున్నాయి. ఏఐఎంఐఎం నేతను హస్తం పార్టీ వైపు మొగ్గు చూపేలా చేయడంలో మైనారిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు, రాజ్యసభ ఎంపీ ఇమ్రాన్ ప్రతాప్గర్హి కీలక పాత్ర పోషించారని తెలుస్తోంది.
ఉత్తర్ప్రదేశ్లో కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీల మధ్య పొత్తు ఉంది. సీట్ల పంపకంపై ఇరు పార్టీల మధ్య అధికారిక చర్చలు ఇంకా ప్రారంభం కాలేదు. అయినప్పటికీ ప్రముఖ వ్యక్తులను చేర్చుకోవడంతో మరిన్ని సీట్లు దక్కించుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. ఈ మేరకు యూపీలో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతోంది. ఆ రాష్ట్రానికి చెందిన పలువురు సీనియర్ నేతలను పార్టీలో చేర్చుకునేందుకు సంప్రదింపులు జరుపుతోంది. అసిమ్ వకార్తో పాటు మోహన్లాల్గంజ్ మాజీ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి కౌశల్ కిషోర్తోనూ కాంగ్రెస్ నేతలు చర్చిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
కేంద్రం తన హామీని నిలబెట్టుకుంది.. విద్యార్థులపై ఎలాంటి చర్యలు ఉండవు: జేపీ నడ్డా..
సముద్ర మట్టాల పెరుగుదలతో ముంబై, కోల్కతాకు పెను ప్రమాదం