జమ్ముకశ్మీర్లో భూప్రకంపనలు.. ఇళ్ల నుంచి పరుగులు తీసిన జనం
ABN , Publish Date - Feb 02 , 2026 | 08:00 AM
జమ్ముకశ్మీర్లో సోమవారం ఉదయం భూప్రకంపనలు సంభవించాయి. ప్రాథమిక సమాచారం మేరకు భూప్రకంపనల తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.8గా నమోదైంది.
శ్రీనగర్, ఫిబ్రవరి 2: జమ్ముకశ్మీర్లో సోమవారం ఉదయం భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ప్రాథమిక సమాచారం మేరకు ఈ తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.8గా నమోదైంది. ఈ ఉదయం గం.5:35 ప్రాంతంలో భూప్రకంపనలు సంభవించాయి. ఒక్కసారిగా భూమి కంపించడంతో జనం భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. బుద్గామ్ జిల్లాలో 33.9 డిగ్రీస్ నార్త్.. 74.76 డిగ్రీస్ ఈస్ట్ కోఆర్డినేట్స్ వద్ద 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్స్(జీఎఫ్జెడ్) తెలిపింది.
భూకంపం సంభవించిన సమయంలో ఎపిసెంటర్ ప్రాంతంలో మేఘాలు కమ్మేశాయి. ఉష్ణోగ్రత మైనస్ 0.9 డిగ్రీల సెల్సియస్కు పడిపోయింది. తేమ శాతం 95 శాతంగా ఉండగా, పశ్చిమ దిశగా సెకనుకు 1 మీటరు వేగంతో తేలికపాటి గాలి వీచింది. భూప్రకంపనల కారణంగా 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న చారర్ ఐ షరీఫ్, 13 కిలోమీటర్ల దూరంలో ఉన్న పుల్వామా, 21 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీనగర్, సోపియాన్లో భూమి కంపించింది. నిపుణుల అంచనాల ప్రకారం.. ఈ భూప్రకంపనల వల్ల విడుదలైన భూకంప శక్తి సుమారు 1 × 10¹² జౌల్స్గా ఉంది.
ఇది సుమారు 278 మెగావాట్ అవర్స్ లేదా దాదాపు 239 టన్నుల టీఎన్టీ పేలుడు శక్తికి సమానం. భూకంప తీవ్రత మధ్యస్థంగా ఉన్నప్పటికీ.. ఇలాంటి ఎనర్జీ లెవెల్స్ సాధారణంగా ప్రజలను నిద్రలేపే స్థాయిలో ఉండటంతో పాటు వారిని భయాందోళనకు గురిచేసే అవకాశం ఉంటుంది.
నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ప్రకారం.. సోమవారం ఉదయం అండమాన్ నికోబార్ దీవుల్లోనూ భూప్రకంపనలు సంభవించాయి. తెల్లవారుజామున 3:31 గంటల ప్రాంతంలో భూమి ఒక్కసారిగా కంపించింది. భూప్రకంపనల తీవ్రత రెక్టార్ స్కేలుపై 4.6గా నమోదైంది. భూకంప కేంద్రం నికోబార్ ప్రాంతంలో పది కిలోమీటర్ల లోతులో కేంద్రీకృతమైంది.
ఇవి కూడా చదవండి
మహిళా సాధికారతకు ‘షి’ మార్టులు
ఆహారం, ఎరువులు, ఇంధనంపై సబ్సిడీ 4.47 శాతం తగ్గింపు