తిరుమల వెళ్తున్నారా? టీటీడీ వసతి గదులు ఇలా బుక్ చేసుకోండి
ABN , Publish Date - Jul 17 , 2026 | 12:22 PM
తిరుపతిలో టీటీడీ ఆధ్వర్యంలో భక్తుల కోసం పలు వసతి కేంద్రాలు అందుబాటులో ఉన్నాయి. ఆన్లైన్ లేదా కరెంట్ బుకింగ్ ద్వారా గదులను రిజర్వ్ చేసుకునే అవకాశం ఉంది. పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
ఇంటర్నెట్ డెస్క్: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు రోజూ దేశం నలుమూలలతో పాటు విదేశాల నుంచి కూడా వేలాది మంది భక్తులు తిరుమలకు చేరుకుంటారు. అయితే, నిత్యం ఉండే రద్దీ కారణంగా వసతి గదులను ఎలా బుక్ చేసుకోవాలి, ఎక్కడ లభిస్తాయనే విషయంలో చాలామంది భక్తులకు సందిగ్ధత ఉంటుంది. అయితే, గదుల విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. తిరుమలలో గదులు అందుబాటులో లేకపోయినా, తిరుపతిలో టీటీడీ నిర్వహిస్తున్న అనేక వసతి సముదాయాలు, డార్మిటరీలు భక్తులకు అందుబాటులో ఉంటాయి. ముందస్తుగా బుకింగ్ చేసుకోవడం ద్వారా సౌకర్యవంతమైన వసతిని పొందవచ్చు.
భక్తుల కోసం టీటీడీ ప్రత్యేక వసతి ఏర్పాట్లు
తిరుపతిలో భక్తులకు సౌకర్యవంతమైన బస కోసం టీటీడీ పలు వసతి సముదాయాలను నిర్వహిస్తోంది. వీటిలో ఏసీ, నాన్-ఏసీ గదులు, డార్మిటరీలు, లాకర్లు, స్నానపు గదులు, ప్రథమ చికిత్స కేంద్రాలు అందుబాటులో ఉంటాయి. టీటీడీ నిబంధనల ప్రకారం.. ఒంటరి, అవివాహిత స్త్రీ, పురుష జంటలకు గదులు కేటాయించరు. దర్శనం పూర్తయిన వెంటనే గదులు, లాకర్లు ఖాళీ చేసి ఇతర భక్తులకు సహకరించాలని టీటీడీ సూచిస్తోంది.
తిరుపతిలో టీటీడీ నిర్వహిస్తున్న ప్రధాన వసతి కేంద్రాలు
విష్ణునివాసం
2011లో ప్రారంభమైన ఈ వసతి సముదాయంలో 408 గదులు, 9 హాళ్లు, 706 లాకర్లు ఉన్నాయి. ఏసీ, నాన్-ఏసీ గదులు ఆన్లైన్ బుకింగ్తో పాటు రొటేషన్ విధానంలో కేటాయిస్తారు.
శ్రీనివాసం కాంప్లెక్స్
2003లో ప్రారంభించిన ఈ కాంప్లెక్స్లో 552 గదులు, 9 డార్మిటరీలు, 1,038 లాకర్లు ఉన్నాయి. డీలక్స్, ఏసీ, నాన్-ఏసీ గదులు భక్తులకు అందుబాటులో ఉంటాయి.
మాధవం గెస్ట్ హౌస్
2009లో ప్రారంభమైన ఈ గెస్ట్ హౌస్లో 164 ఏసీ గదులుతో పాటు డీలక్స్ సూట్లు ఉన్నాయి.
ఎస్వీ గెస్ట్ హౌస్
1955లో నిర్మించిన ఈ గెస్ట్ హౌస్లో 31 ఏసీ, నాన్-ఏసీ గదులు ఉన్నాయి. ముందుగా వచ్చిన వారికి ముందుగా గదులు కేటాయించే విధానాన్ని అమలు చేస్తున్నారు.
గదులు ఎలా బుక్ చేసుకోవాలి?
విష్ణునివాసంలో పరిమిత సంఖ్యలో కొన్ని గదులు ప్రత్యక్షంగా కేటాయిస్తారు. మిగిలిన వసతి సముదాయాల్లో గదులను టీటీడీ అధికారిక వెబ్సైట్ ద్వారా ముందుగానే బుక్ చేసుకోవాలి. ముందస్తు బుకింగ్ చేసుకోవడం వల్ల భక్తులు చివరి నిమిషంలో ఇబ్బందులు ఎదుర్కోకుండా దర్శనం పూర్తి చేసుకోవచ్చు.
తిరుమల, తిరుపతి వసతి బుకింగ్ కోసం భక్తులు టీటీడీ అధికారిక వెబ్సైట్లో మాత్రమే ముందస్తు రిజర్వేషన్ చేసుకోవాలి. ఇది సురక్షితమైన, అధికారిక మార్గం. టీటీడీ (TTD) వసతి గదులను ఆన్లైన్ లేదా తిరుమలలో నేరుగా (ఆఫ్లైన్) బుక్ చేసుకోవచ్చు. ముందుగా బుక్ చేసుకోవడానికి మీ వద్ద దర్శనం లేదా సేవా టిక్కెట్ ఉండాలి.
ఆన్లైన్ బుకింగ్ విధానం:
అధికారిక TTD వెబ్సైట్ లేదా మొబైల్ యాప్ను సందర్శించాలి.
మీ మొబైల్ నంబర్, ఓటీపీ (OTP) ఉపయోగించి లాగిన్ అవ్వాలి.
'Accommodation' ఆప్షన్ను ఎంచుకుని, దర్శనం టిక్కెట్ వివరాలు నమోదు చేయాలి.
అందుబాటులో ఉన్న తేదీలు, గదుల రకాన్ని బట్టి రూ.100 నుంచి రూ.1000 వరకు ఆన్లైన్ ద్వారా చెల్లించి గదిని బుక్ చేసుకోవాలి.
Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.
Also Read:
ఫ్రిజ్ లేకుండానే టమోటాలు ఎక్కువ రోజులు తాజాగా ఉండాలా?
ఈ తేదీల్లో పుట్టినవారిది రాజసమైన వ్యక్తిత్వం..!