రిపబ్లిక్ డే రోజు తప్పక చూడాల్సిన చారిత్రాత్మక ప్రదేశాలు
ABN , Publish Date - Jan 23 , 2026 | 04:13 PM
రిపబ్లిక్ డే సందర్భంగా ట్రిప్నకు వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ జనవరి 26న దేశ చరిత్ర, త్యాగం, జాతీయ గర్వాన్ని గుర్తుచేసే అత్యంత చారిత్రాత్మక ప్రదేశాలను సందర్శించి దేశభక్తి అనుభూతిని ఆస్వాదించవచ్చు.
ఇంటర్నెట్ డెస్క్: జనవరి 26 అంటే కేవలం ఒక తేదీ కాదు. అది భారతదేశ గౌరవం, రాజ్యాంగం, ప్రజాస్వామ్య విలువలను జరుపుకునే రోజు. ప్రతి సంవత్సరం ఢిల్లీలో ఇండియా గేట్ వద్ద నిర్వహించే గణతంత్ర దినోత్సవ కవాతు ఎంతో గర్వకారణం. కానీ భద్రతా ఆంక్షలు, పాస్ల సమస్యలు, జనసందోహం వల్ల చాలా మంది ఈ కవాతుకు హాజరు కాలేకపోతారు. అలాంటివారు నిరాశ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేశభక్తి అనుభూతి పొందేందుకు ఢిల్లీ మాత్రమే కాదు.. దేశమంతా అలాంటి భావన కలిగించే ఎన్నో ప్రదేశాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
జలియన్వాలాబాగ్ – పంజాబ్
పంజాబ్లోని అమృత్సర్లో ఉన్న జలియన్వాలాబాగ్ ఒక విషాద చరిత్ర కలిగిన ప్రదేశం. ఎందుకంటే.. 1919 ఏప్రిల్ 13న బ్రిటీష్ జనరల్ డయ్యర్ అకారణంగా జరిపిన కాల్పులతో వందలాది మంది భారతీయులు బలయ్యారు. ఈ దారుణకాండ.. భారత స్వాతంత్య్ర పోరాటంలో ఒక కీలక మలుపుగా నిలిచి, దేశవ్యాప్తంగా జాతీయోద్యమాన్ని తీవ్రతరం చేసింది. నేడు ఇది జాతీయ స్మారక చిహ్నంగా ఉంది. గణతంత్ర దినోత్సవం సమయంలో అక్కడి మార్కెట్లు త్రివర్ణ రంగులతో మెరుస్తాయి. గురుద్వారాలు దీపాలు, దేశభక్తి గీతాలతో అలంకరించబడతాయి. ఈ వాతావరణం ప్రతి ఒక్కరినీ కదిలిస్తుంది.

సబర్మతి ఆశ్రమం – అహ్మదాబాద్
ఈ ఆశ్రమానికి మహాత్మా గాంధీతో ప్రత్యేకమైన అనుబంధం ఉంది. స్వాతంత్య్ర ఉద్యమంలో భాగంగా గాంధీజీ ఇక్కడి నుంచే దండి యాత్రను ప్రారంభించారు. ఇది స్వేచ్ఛ, సత్యం, అహింసకు ప్రతీకగా నిలిచిన ప్రదేశం.

వాఘా సరిహద్దు
దేశభక్తి అనగానే ఎక్కువగా వాఘా సరిహద్దు గుర్తుకు వస్తుంది. రిపబ్లిక్ డే నాడు ఇక్కడ జరిగే సాయంత్రం కవాతు చూడటం ఓ ప్రత్యేక అనుభవం. భారత బీఎస్ఎఫ్ సైనికులు క్రమశిక్షణతో, ఉత్సాహంతో చేసే కవాతు భారతదేశ బలాన్ని చూపిస్తుంది. వేలాది మంది 'భారత్ మాతా కీ జై' నినాదాలతో ఈ వాతావరణాన్ని మరింత ఉత్సాహంగా మారుస్తారు.

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మ్యూజియం
ఢిల్లీలోని పాలం ప్రాంతంలో ఉన్న ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మ్యూజియం కూడా గణతంత్ర దినోత్సవం రోజు సందర్శించడానికి మంచి ప్రదేశం. ఇక్కడ ఫైటర్ జెట్లు, వైమానిక దళం ఉపయోగించే విమానాలు, యుద్ధ సామగ్రి చూడవచ్చు. భారత వైమానిక దళం చేసిన సేవల గురించి వివరంగా తెలుసుకోవచ్చు. టికెట్ ధర పిల్లలకు రూ.30, పెద్దలకు రూ.50 మాత్రమే ఉంటుంది. కాబట్టి ఈసారి జనవరి 26 కవాతుకు వెళ్లలేకపోయినా ఈ ప్రదేశాల్లో దేశభక్తిని పూర్తిగా అనుభవించవచ్చు.

Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించలేదు.
Also Read:
అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించిన ప్రధాని మోదీ
భయమెరుగని నాయకత్వ పటిమకు నేతాజీ ప్రతీక: ప్రధాని మోదీ
For More Latest News