Share News

IRCTC అరుణాచల మోక్ష యాత్ర.. 5 రోజుల టూర్ ప్యాకేజీ ఇదే!

ABN , Publish Date - Aug 18 , 2026 | 07:05 PM

ఆధ్యాత్మిక క్షేత్రాలను దర్శించుకోవాలనుకునే భక్తుల కోసం ఐఆర్‌సీటీసీ ప్రత్యేక టూర్‌ ప్యాకేజీని అందిస్తోంది. ‘అరుణాచల మోక్ష యాత్ర’ పేరుతో ఐదు రోజుల ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చింది.

IRCTC అరుణాచల మోక్ష యాత్ర.. 5 రోజుల టూర్ ప్యాకేజీ ఇదే!
IRCTC Arunachalam Tour Package 2026

ఇంటర్నెట్ డెస్క్: ఆధ్యాత్మిక క్షేత్రాలను సందర్శించాలనుకునే వారికి ఐఆర్‌సీటీసీ (IRCTC) ప్రత్యేక టూర్‌ ప్యాకేజీని అందిస్తోంది. ‘అరుణాచల మోక్ష యాత్ర’ పేరుతో రూపొందించిన ఈ ప్యాకేజీలో పుదుచ్చేరి, తిరువణ్ణామలై (అరుణాచలం), కాంచీపురంలోని ప్రముఖ ప్రాంతాలు, ఆలయాలను సందర్శించే అవకాశం ఉంటుంది. కాచిగూడ నుంచి రైలు ప్రయాణంతో మొదలయ్యే ఈ యాత్రలో రైలు ప్రయాణంతో పాటు హోటల్‌ వసతి, స్థానిక సందర్శనలను ప్యాకేజీలో భాగంగా అందిస్తున్నారు.

ప్యాకేజీ వివరాలు

  • ప్యాకేజీ పేరు: అరుణాచల మోక్ష యాత్ర

  • ప్యాకేజీ కోడ్: SHR107

  • వ్యవధి: 4 రాత్రులు, 5 రోజులు

  • ప్రధాన ప్రాంతాలు: పుదుచ్చేరి, అరుణాచలం, కాంచీపురం

  • ప్రయాణం: రైలు

  • బయలుదేరే ప్రాంతం: కాచిగూడ

  • ప్రారంభ సమయం: సాయంత్రం 5 గంటలు

  • ప్రయాణ తరగతులు: SL, 3AC

  • టూర్ ప్రారంభం: ప్రతి శుక్రవారం

  • భోజనం: 2 బ్రేక్‌ఫాస్ట్‌లు


ప్యాకేజీ ధరలు ఎంత?

2026 జూన్‌ 1 నుంచి అమల్లో ఉన్న టారిఫ్‌ ప్రకారం, 1 నుంచి 3 మంది కలిసి ప్రయాణించే వారికి 3AC కంఫర్ట్‌ విభాగంలో ట్విన్‌ షేరింగ్‌ ధర ఒక్కొక్కరికి రూ.16,900గా ఉంది. ట్రిపుల్‌ షేరింగ్‌ అయితే ఒక్కొక్కరికి రూ.13,210 చెల్లించాలి. పిల్లలకు బెడ్‌తో కలిపి రూ.10,030, బెడ్‌ అవసరం లేకపోతే రూ.7,530గా ధర నిర్ణయించారు.

SL స్టాండర్డ్‌ కేటగిరీలో ట్విన్‌ షేరింగ్‌ ధర రూ.14,820, ట్రిపుల్‌ షేరింగ్‌ ధర రూ.11,125. పిల్లలకు బెడ్‌తో రూ.7,950, బెడ్‌ లేకుండా రూ.5,450గా ఉంది. ఒక గ్రూప్‌గా 4 నుంచి 6 మంది ప్రయాణిస్తే ప్యాకేజీ ధరలో మార్పు ఉంటుంది.

3AC కంఫర్ట్‌:

  • ట్విన్‌ షేరింగ్‌: రూ.13,900

  • ట్రిపుల్‌ షేరింగ్‌: రూ.11,920

SL స్టాండర్డ్‌:

  • ట్విన్‌ షేరింగ్‌: రూ.11,820

  • ట్రిపుల్‌ షేరింగ్‌: రూ.9,840


ఐదు రోజుల యాత్ర షెడ్యూల్‌ ఇదే

  • మొదటి రోజు – శుక్రవారం: యాత్ర కాచిగూడ రైల్వే స్టేషన్‌ నుంచి ప్రారంభమవుతుంది. సాయంత్రం 5 గంటలకు 17653 కాచిగూడ–పుదుచ్చేరి ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణం మొదలవుతుంది. రాత్రంతా రైలులో ప్రయాణం కొనసాగుతుంది.

  • రెండో రోజు – శనివారం: ఉదయం 11:05 గంటలకు పుదుచ్చేరి చేరుకుంటారు. అక్కడి నుంచి హోటల్‌కు వెళ్లి చెక్‌ఇన్‌ చేస్తారు. అనంతరం ఆరోవిల్, శ్రీ అరబిందో ఆశ్రమం, ప్యారడైజ్‌ బీచ్‌ వంటి ప్రముఖ ప్రదేశాలను సందర్శించే అవకాశం ఉంటుంది. రాత్రి పుదుచ్చేరిలోనే బస చేస్తారు.

  • మూడో రోజు – ఆదివారం: ఉదయం హోటల్‌లో అల్పాహారం చేసిన తర్వాత పుదుచ్చేరి నుంచి తిరువణ్ణామలై వైపు బయలుదేరుతారు. పుదుచ్చేరి నుంచి అరుణాచలం దాదాపు 120 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. తిరువణ్ణామలై చేరుకున్న తర్వాత హోటల్‌లో చెక్‌ఇన్‌ చేసి, అనంతరం అరుణాచలేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకోవచ్చు. రాత్రి తిరువణ్ణామలైలోనే బస ఉంటుంది.

  • నాలుగో రోజు – సోమవారం: ఉదయం అల్పాహారం అనంతరం హోటల్‌ నుంచి చెక్‌అవుట్‌ చేసి కాంచీపురానికి బయలుదేరుతారు. అక్కడ కామాక్షి అమ్మవారి ఆలయం, ఏకాంబరేశ్వర ఆలయం వంటి ప్రముఖ ఆలయాలను సందర్శిస్తారు.

    కాంచీపురం దర్శనం పూర్తయిన తర్వాత సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న అరక్కోణానికి చేరుకుంటారు. అక్కడి నుంచి సాయంత్రం 6:05 గంటలకు 17651 నంబర్‌ రైలులో కాచిగూడకు తిరుగు ప్రయాణం ప్రారంభమవుతుంది.

  • ఐదో రోజు – మంగళవారం: ఉదయం 7:50 గంటలకు కాచిగూడ చేరుకోవడంతో ఐదు రోజుల అరుణాచల మోక్ష యాత్ర పూర్తవుతుంది.


ఆధ్యాత్మికతతో పాటు పర్యాటక అనుభూతి

ఈ టూర్‌ ద్వారా ఒకే ప్రయాణంలో పుదుచ్చేరి ఆధ్యాత్మిక, పర్యాటక ప్రాంతాలను చూడటంతో పాటు అరుణాచలేశ్వర స్వామిని దర్శించుకోవచ్చు. అలాగే కాంచీపురంలోని ప్రసిద్ధ ఆలయాలను సందర్శించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా అరుణాచలం, కాంచీపురం, పుదుచ్చేరి ప్రాంతాలను ఒకేసారి చూడాలనుకునే భక్తులకు ఈ ప్యాకేజీ ఉపయోగకరంగా ఉంటుంది.


Also Read:

కూరగాయలు ఎంత తాజాగా కనిపించినా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి

బంధువుల ఇంటికి వెళ్తున్నారా? ఈ తప్పులు అస్సలు చేయకండి..

Updated Date - Aug 18 , 2026 | 07:05 PM