భారతీయులకు యూఎస్ స్టూడెంట్ వీసాల్లో 62 శాతం కోత
ABN , Publish Date - Aug 07 , 2026 | 09:56 AM
భారతీయ విద్యార్థులకు యూఎస్ స్టూడెంట్ వీసాల జారీలో భారీ కోత పడిందని యూఎస్ మేధో మధన సంస్థ సెంటర్ ఫర్ ఇమిగ్రేషన్ స్టడీస్ (సీఐఎస్) తాజాగా పేర్కొంది.
ఇంటర్నెట్ డెస్క్: భారతీయ విద్యార్థులకు యూఎస్ స్టూడెంట్ వీసాల జారీలో భారీ కోత పడిందని యూఎస్ మేధో మధన సంస్థ సెంటర్ ఫర్ ఇమిగ్రేషన్ స్టడీస్ (సీఐఎస్) తాజాగా పేర్కొంది. వీసా ఆంక్షలతో భారతీయులపై అత్యధిక ప్రభావం పడగా రెండో స్థానంలో చైనీయులు ఉన్నట్టు తెలిపింది.
సీఐఎస్ తెలిపిన వివరాల ప్రకారం, 2025లో భారతీయులకు జారీ అయిన విద్యార్థి వీసాల్లో అంతకుమందు ఏడాదితో పోలిస్తే 62 శాతం మేర కోత పడింది. 2024లో భారతీయులకు 58,694 స్టూడెంట్ వీసాలు జారీ కాగా 2025లో ఈ సంఖ్య 22,149కి పడిపోయింది. చైనా విద్యార్థుల వీసాల సంఖ్య 61,075 నుంచి 40,034కు పడిపోయింది. చైనా స్టూడెంట్స్ వీసాల జారీలో 34 శాతం కోత పడింది. అయితే, యూఎస్లోని అంతర్జాతీయ విద్యార్థుల్లో భారతీయులు, చైనీయుల వాటా ఇప్పటికీ అత్యధికమని సీఐఎస్ పేర్కొంది.
2024-25 విద్యా సంవత్సరంలో 3,63,019 మంది భారతీయ విద్యార్థులు, 2,65,919 మంది చైనా విద్యార్థులు యూఎస్లో ఉన్నారు. మొత్తం పోస్ట్ సెకండరీ లెవెల్ విదేశీ స్టూడెంట్స్లో ఇరు దేశాల వాటా దాదాపు 53 శాతంగా ఉందని ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ (ఐఐఈ) తెలిపింది.
ఓపీటీకి ఫుల్ స్టాప్ పెట్టాలి: సీఐఎస్
సీఐఎస్ నివేదిక ప్రకారం, 2024-25లో దాదాపు మూడు లక్షల మంది విదేశీ విద్యార్థులు తమ చదువులు పూర్తయ్యాక ఓపీటీ విధానంలో తాత్కాలిక ఉపాధి పొందారు. ఈ విధానంలో ఉపాధి పొందిన 2,94,253 మంది విదేశీ విద్యార్థుల్లో 49 శాతం మంది భారతీయులు, 21 శాతం మంది చైనీయులు ఉన్నారు. అమెరికా విద్యార్థులు, వర్కర్ల ఉపాధి అవకాశాలపై ఓపీటీ ప్రతికూల ప్రభావం చూపుతోందని సీఐఎస్ తన నివేదికలో పేర్కొంది. ఈ ప్రోగ్రామ్కు ఫుల్ స్టాప్ పెట్టాలని సూచించింది.
ఈ వార్తలనూ చదవండి:
ట్రంప్ కొత్త ఆదేశాలు.. జన్మతః పౌరసత్వ నిబంధనలు మరింత కఠినతరం
అమెరికా క్షిపణి నిల్వలు.. ట్రంప్,హెగ్సెత్ మధ్య విభేదాలు..