ఆ నౌకను జలసమాధి చేసేశాం.. షాకింగ్ వీడియోను షేర్ చేసిన యూఎస్
ABN , Publish Date - Sep 06 , 2026 | 11:11 AM
ఇరాన్ చమురు రవాణా నౌకలపై దాడి వీడియోలను అమెరికా సైనికదళం సెంట్కామ్ తాజాగా షేర్ చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: ఇరాన్ చమురు రవాణా నౌకలపై దాడి వీడియోలను అమెరికా సైనికదళం సెంట్కామ్ తాజాగా షేర్ చేసింది. అమెరికా యుద్ధ నౌకలపై ఇరాన్ దాడులకు ప్రతీకారంగా యూఎస్ ఈ శనివారం నాడు దాడులు చేసింది. మొత్తం మూడు చమురు రవాణా నౌకలపై దాడి చేసింది. ఇందుకు సంబంధించిన వీడియోలను షేర్ చేస్తూ ఇరాన్కు గట్టి వార్నింగ్ ఇచ్చింది.
‘ఎమ్/టీ కైలో నౌక నీట మునిగింది. నీటి అడుగున ఉన్న ఇతర ఇరాన్ యుద్ధ నౌకల పక్కన జలసమాధి అయ్యింది’ అని చెప్పింది. డౌనీ, స్టార్క్ నౌకలను కూడా మళ్లీ కోలుకోని విధంగా దెబ్బతీశామని పేర్కొంది. కైలో నౌకలోని క్రూ దిగిపోయాక దాన్ని జలసమాధి చేశామని పేర్కొంది. ఇరాన్కు నిధులు సమకూర్చే చీకటి నెట్వర్క్లో ఈ మూడు నౌకలు భాగమని పేర్కొంది.
‘ఐఆర్జీసీకి (ఇరాన్ సైనికదళం) మేము ఒక్కటే చెప్పదలుచుకున్నాము. మా రెండు నౌకలపై మీరు దాడి చేస్తే మీ మూడు నౌకలపై మేము దాడి చేస్తాము’ అని సెంట్కామ్ కమాండర్ అడ్మిరల్ బ్రాడ్ కూపర్ వార్నింగ్ ఇచ్చారు. స్వీయరక్షణ విషయంలో తమకు ఎలాంటి సంకోచాలు ఉండవని స్పష్టం చేశారు. అవసరమైతే ఇరాన్కు మిగిలున్న కొన్ని నౌకలను కూడా ధ్వంసం చేస్తామని వార్నింగ్ ఇచ్చారు.
అయితే, అమెరికా దాడులు అక్రమమైనవని, బాధ్యతారహితమైనవని ఇరాన్ ఆరోపించింది. ఇది సముద్ర వాణిజ్యంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపిస్తుందని పేర్కొంది. అంతర్జాతీయ శాంతిభద్రతలకు ముప్పు అని హెచ్చరించింది.
ఈ వార్తలనూ చదవండి:
విమానంలో అలజడి సృష్టించిన వృద్ధుడు.. ప్లాస్టర్తో సీటుకు కట్టేసిన సిబ్బంది..
పెళ్లి పార్టీలో అగ్ని ప్రమాదం.. 22 మంది దుర్మరణం..