చర్చల్లో ప్రతిష్టంభన.. ట్రంప్ తదుపరి వ్యూహం ఇదేనా?
ABN , Publish Date - Apr 13 , 2026 | 11:15 AM
ఇరాన్పై పరిమిత స్థాయి దాడులను ప్రారంభించే యోచనలో యూఎస్, ఇజ్రాయెల్ ఉన్నట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
ఇంటర్నెట్ డెస్క్: యూఎస్-ఇరాన్ చర్చలు విఫలం కావడంతో పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్తతలు చెలరేగాయి. ఇరాన్ పోర్టుల నుంచి నౌకలు హోర్ముజ్ మీదుగా రాకపోకలు సాగించకుండా నేటి సాయంత్రం 7.30 (భారత కాలమానం ప్రకారం) నిర్బంధం విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. దీంతో పాటు ఇరాన్పై యూఎస్, ఇజ్రాయెల్లు మళ్లీ దాడులు చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
అణు కార్యక్రమాన్ని వదులుకునేలా ఇరాన్పై ఒత్తిడి తెచ్చేందుకు ఇజ్రాయెల్ దాడులను ప్లాన్ చేస్తున్నట్టు మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఆర్మీ సిద్ధంగా ఉండాలని ఇప్పటికే ఇజ్రాయెల్ రక్షణ దళం చీఫ్ లెఫ్టెనెంట్ జనరల్ జమీర్ ఆదేశించారు. మరోవైపు, ఇరాన్పై పరిమిత స్థాయిలో దాడులు చేసేందుకు ట్రంప్, ఆయన సలహాదారులు యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఇరాన్ను అన్ని వైపుల నుంచి దిగ్బంధించి చర్చల్లో ప్రతిష్టంభనను తొలగించాలనేది యూఎస్ ప్రభుత్వం ఉద్దేశమని కథనాలు వెలువడ్డాయి. ఈ దిశగా నాటో దేశాలను కూడా రంగంలోకి దింపేందుకు అమెరికా ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.
ఇప్పటికే హోర్ముజ్ మీదుగా నౌకల రాకపోకలను ఇరాన్ నిలిపివేసిన విషయం తెలిసిందే. హోర్ముజ్ జలాల్లోకి యూఎస్ యుద్ధ నౌకలు వస్తే దాడులు తప్పవని హెచ్చరించింది. చర్చలు విఫలం కావడానికి అమెరికానే కారణమని తేల్చి చెప్పింది. యూఎస్ పెట్టిన అసమంజసమైన డిమాండ్స్ కారణంగానే చర్చల్లో పీటముడి పడిందని పేర్కొంది. అణు కార్యక్రమం వదులుకునే దిశగా ఇరాన్ నుంచి స్పష్టమైన హామీలు రాలేదని యూఎస్ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ పేర్కొన్నారు. ఇరాన్తో చర్చలు ముగిసిన అనంతరం పత్రికా సమావేశంలో ఈ కామెంట్ చేశారు.
ఈ వార్తలనూ చదవండి:
యూఎస్కు ఇరాన్ వార్నింగ్.. ఏ పొరపాటు చేసినా..
అందమైన అమ్మాయిని పంపండి.. నేను పెళ్లి చేసుకుంటా: ఉగాండా ఆర్మీ చీఫ్ జనరల్