Share News

ట్రంప్.. ఆ చిన్నారుల కళ్లల్లోకి చూడు! ఇరాన్ పత్రిక సంచలన కథనం

ABN , Publish Date - Mar 09 , 2026 | 07:36 PM

ఇరాన్‌లోని పాఠశాలపై దాడికి ట్రంప్ ప్రభుత్వం కారణమంటూ అక్కడి పత్రిక టెహ్రాన్ టైమ్స్ తాజాగా కథనాన్ని ప్రచురించింది. దాడిలో మరణించిన చిన్నారుల ఫొటోలను కూడా ప్రచురించింది.

ట్రంప్.. ఆ చిన్నారుల కళ్లల్లోకి చూడు! ఇరాన్ పత్రిక సంచలన కథనం
Tehran Times Trump criticism

ఇంటర్నెట్ డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై విమర్శలు ఎక్కుపెడుతూ ఇరాన్ పత్రిక టెహ్రాన్ టైమ్స్ తాజాగా ప్రచురించిన కథనం ప్రస్తుతం సంచలనంగా మారింది. యుద్ధం మొదలైన తొలి రోజు జరిగిన దాడిలో మినాబ్‌ ప్రాంతంలోని ఒక పాఠశాలలో మరణించిన 150 మంది చిన్నారుల ఫొటోలను టెహ్రాన్ టైమ్స్ ప్రచురించింది. ఇరాన్‌పై మిలిటరీ చర్యలకు సంబంధించి ట్రంప్ చేసిన ప్రకటనల్లో అసత్యాలు ఉన్నాయని ఆరోపించింది. నెపాన్నీ ఇతరులపై నెట్టేందుకు ట్రంప్ ప్రయత్నిస్తున్నారని మండిపడింది. దౌత్యపరిష్కారాలను కూడా తిరస్కరిస్తున్నారని ఆరోపించింది.

మినాబ్ ప్రాంతంలో దాడికి అమెరికా మిలిటరీ కారణమయ్యే అవకాశాన్ని కొట్టిపారేయలేమంటూ న్యూయార్క్ టైమ్స్ ఒక కథనాన్ని ప్రచురించిన నేపథ్యంలో టెహ్రాన్ టైమ్స్ ట్రంప్‌పై విమర్శలను ఎక్కుపెట్టింది. ఇక, మినాబ్ ప్రాంతంలో దాడికి ఇరాన్ కారణమని ట్రంప్ స్పష్టం చేశారు. ‘ఇరాన్ వల్లే ఇది జరిగిందని అనుకుంటున్నాము. వారి ఆయుధాలకు కచ్చితత్వం లేదు’ అని వ్యాఖ్యానించారు.


ఫిబ్రవరి 28న మినాబ్‌లో ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్‌కు చెందిన ఒక మిలిటరీ స్థావరంపై ఈ దాడి జరిగింది. ఈ క్రమంలో శకలాలు సమీపంలోని స్కూల్‌కు తగలడంతో 165 మంది దుర్మరణం చెందారు. వీరిలో అధిక శాతం మంది చిన్నారులే ఉన్నారు. నెదర్‌ల్యాండ్స్‌కు చెందిన నిజనిర్ధారణ సంస్థ బెల్లింగ్ కాట్‌కు చెందిన పరిశోధకుడు ఈ విషయమై తాజాగా కీలక ప్రకటన చేశారు. ఈ దాడికి టామహాక్ మిసైల్స్ కారణమై ఉండొచ్చని అన్నారు. ఇవి అమెరికా వద్ద తప్ప ఆ ప్రాంతంలో ఇతర దేశాల వద్ద లేవని పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి..

కొత్త సుప్రీం లీడర్‌ను టార్గెట్‌ చేయవద్దన్న చైనా

ఇరాన్ నూతన సుప్రీం లీడర్‌గా మొజ్తాబా ఖమేనీ.. ప్రస్థానమిదే..

Updated Date - Mar 09 , 2026 | 08:45 PM