Share News

దాడుల్లో దెబ్బతిన్న గాంధీ హాస్పిటల్.. వీడియో షేర్ చేసిన ఇరాన్ ఎంబసీ

ABN , Publish Date - Apr 13 , 2026 | 11:53 AM

యూఎస్-ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్‌లోని గాంధీ ఆసుపత్రి దెబ్బతిందంటూ ఇరాన్ తాజాగా ఒక వీడియోను షేర్ చేసింది.

దాడుల్లో దెబ్బతిన్న గాంధీ హాస్పిటల్.. వీడియో షేర్ చేసిన ఇరాన్ ఎంబసీ
Gandhi Hospital In Iran

ఇంటర్నెట్ డెస్క్: యూఎస్, ఇజ్రాయెల్‌ దేశాలు పౌర నిర్మాణాలపై వైమానిక దాడులు చేస్తున్నాయని ఇరాన్ ఆరోపిస్తోంది. ఈ దాడుల్లో టెహ్రాన్‌లోని గాంధీ ఆసుపత్రి దెబ్బతిందంటూ భారత్‌లోని ఇరాన్ ఎంబసీ తాజాగా వీడియోను షేర్ చేసింది. అక్కడి గాంధీ ఆసుపత్రిలో ప్రధానంగా పిల్లలకు చికిత్సను అందిస్తుంటారు. వైమానిక దాడుల్లో ఆసుపత్రి బాగా దెబ్బతిందని ఇరాన్ పేర్కొంది.

ఇక వీడియోలోని వ్యక్తి మాట్లాడుతూ ఇరాన్ కూడా 11 దేశాలను టార్గెట్ చేసిందని అన్నారు. అయితే, ఇరాన్ ఏనాడూ ఆసుపత్రులను చిన్నారులను టార్గెట్ చేయలేదని చెప్పారు. అమెరికా-ఇజ్రాయెల్ దాడుల కారణంగా ఇరాన్‌లో దాదాపు 600 ఆసుపత్రులు దెబ్బతిన్నాయని అన్నారు. మరో 60 స్కూళ్లు కూడా దెబ్బతిన్నాయని చెప్పారు.


రాయిటర్స్ కథనం ప్రకారం, మార్చి 2న జరిగిన వైమానిక దాడిలో గాంధీ ఆసుపత్రి దెబ్బతింది. ఆసుపత్రి భారీగా దెబ్బతిన్నదని ప్రత్యక్ష సాక్షులు కూడా తెలిపారు. పేషెంట్లను ఇతర ఆసుపత్రులకు తరలించామని కూడా పేర్కొన్నారు. ఫిబ్రవరి 28న యూఎస్, ఇజ్రాయెల్‌ను ఇరాన్‌పై దాడులు ప్రారంభించిన విషయం తెలిసిందే.

మరోవైపు, ఇరాన్ పోర్టుల నుంచి హోర్ముజ్ మీదుగా నౌకలు రాకపోకలు సాగించకుండా దిగ్బంధిస్తామని అమెరికా ఇటీవల ప్రకటించింది. నేటి సాయంత్రం నుంచే అమెరికా ఇరాన్‌ను దిగ్బంధనం చేయనుంది. ఇరాన్‌తో చర్చలు విఫలం కావడంతో ఈ ప్రకటన చేసింది. ఇక ఇరాన్‌పై పరిమిత స్థాయిలో దాడులు చేసే యోచనలో కూడా యూఎస్, ఇజ్రాయెల్‌ దేశాలు ఉన్నట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.


ఈ వార్తలనూ చదవండి:

చర్చల్లో ప్రతిష్టంభన.. ట్రంప్ తదుపరి వ్యూహం ఇదేనా?

ట్రంప్‌ను అధ్యక్ష పదవి నుంచి తొలగించాల్సిందే: మాజీ సీఐఏ చీఫ్

Updated Date - Apr 13 , 2026 | 12:26 PM