హోర్ముజ్ను దాటిన చైనా నౌక!
ABN , Publish Date - Apr 14 , 2026 | 11:49 AM
అమెరికా దిగ్బంధనం కొనసాగుతున్నప్పటికీ చైనా నౌక ఒకటి హోర్ముజ్ను దాటినట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
ఇంటర్నెట్ డెస్క్: అమెరికా దిగ్బంధనాన్ని లెక్క చేయక ఒక చైనా నౌక హోర్ముజ్ జలసంధిని దాటినట్టు అంతర్జాతీయ మీడియాలో తాజాగా కథనాలు వెలువడ్డాయి. షిప్ ట్రాకింగ్ సంస్థలు ఎల్ఎస్ఈజీ, మెరైన్ట్రాఫిక్, కెప్లర్ డేటా ఆధారంగా ఈ కథనాలు వెలువడ్డాయి. యూఏఈలో చివరి పోర్టు కాల్ తరువాత రిచ్ స్టారీ నౌక హోర్ముజ్ను దాటినట్టు తెలుస్తోంది. ఈ నౌక ఒక చైనా షిప్పింగ్ సంస్థకు చెందినదని సమాచారం. ఇరాన్తో లావాదేవీలు జరిపిన ఈ సంస్థపై గతంలో అమెరికా ఆంక్షలు విధించింది.
ఇరాన్ పోర్టుల నుంచి నౌకలు రాకపోకలు సాగించకుండా హోర్ముజ్ను యూఎస్ దిగ్బంధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చైనా అమెరికాకు వార్నింగ్ ఇచ్చింది. ఇరాన్తో తమకున్న దౌత్య సంబంధాల విషయంలో జోక్యం చేసుకోవద్దని చైనా రక్షణ మంత్రి అడ్మిరల్ డాంగ్ జున్ హెచ్చరించారు. హోర్ముజ్లో తమ నౌకల కార్యకలాపాలు యథాతథంగా సాగుతున్నాయని అన్నారు. ఇరాన్తో కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందాల విషయంలో చైనా రాజీపడదని అన్నారు. ఈ విషయంలో ఇతరులు జోక్యం చేసుకోకూడదని తేల్చి చెప్పారు. హోర్ముజ్ జలసంధి ఇరాన్ నియంత్రణలోనే ఉందని కూడా చెప్పారు.
ఈ వార్తలనూ చదవండి:
యూఎస్, ఇరాన్ మధ్య మరోసారి చర్చలు?
హోర్ముజ్ దిగ్బంధనం వద్దు.. యూఎస్పై సౌదీ అరేబియా ఒత్తిడి!