Share News

హోర్ముజ్‌ను తెరిపించేందుకు చర్చలు.. భారత్‌కు యూకే ఆహ్వానం

ABN , Publish Date - Apr 02 , 2026 | 07:18 PM

హోర్ముజ్ జలసంధిని తెరిపించేందుకు ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. ఈ విషయమై నేడు 35 దేశాలతో జరగనున్న సమావేశంలో భారత్‌ పాల్గొనాలని బ్రిటన్ తాజాగా ఆహ్వానించింది.

హోర్ముజ్‌ను తెరిపించేందుకు చర్చలు.. భారత్‌కు యూకే ఆహ్వానం
UK Invites India To Participate in Talks on Hormuz Strait

ఇంటర్నెట్ డెస్క్: హోర్ముజ్‌ జలసంధిని తెరిపించేందుకు ప్రపంచ దేశాలు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశాయి. ఈ విషయమై చర్చించేందుకు నేడు 35 దేశాలు సమావేశం కానున్నాయి. ఇందులో పాల్గొనాలంటూ భారత్‌ను తాజాగా యూకే ఆహ్వానించింది. ఈ విషయాన్ని భారత విదేశాంగ శాఖ గురువారం తెలిపింది. భారత్ తరపున విదేశాంగ శాఖ సెక్రెటరీ విక్రమ్ మిస్రీ ఈ సమావేశంలో పాల్గొంటారని విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. ‘హోర్ముజ్‌పై చర్చల కోసం భారత్ సహా పలు దేశాలను యూకే ఆహ్వానించింది. మా తరపున విదేశాంగ శాఖ సెక్రటరీ నేటి సాయంత్రం జరగనున్న సమావేశంలో పాల్గొంటారు’ అని ఆయన తెలిపారు.

భారత్ ఇప్పటికే ఇరాన్‌తో పాటు ఇతర దేశాలతో ఈ విషయమై చర్చలు జరుపుతోందని రణధీర్ జైస్వాల్ తెలిపారు. హోర్ముజ్ మీదుగా సరకు రవాణాకు అంతరాయం కలగకుండా తమ వంతు ప్రయాత్నాలను చేస్తున్నామని చెప్పారు. ఈ ప్రయత్నాలు ఫలితాలను ఇస్తున్నాయని కూడా అన్నారు. భారత్‌కు చెందిన ఆరు నౌకలు సురక్షితంగా హోర్ముజ్‌ను దాటగలిగాయని అన్నారు.


తాజా సమావేశంలో భారత్‌తో పాటు ఫ్రాన్స్, జర్మనీ, కెనడా, జపాన్, ఇటలీ తదితర దేశాలు పాల్గొంటున్నాయని బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పరిస్థితులను చక్కదిద్దేందుకు అందుబాటులో ఉన్న అన్ని మార్గాలను పరిశీలిస్తామని తెలిపారు.

హోర్ముజ్ జలసంధి మీదుగా ఎవరి ముడి చమురును వారే తెచ్చుకోవాలని ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియాలో తన ఆక్రోశం వెళ్లగక్కిన విషయం తెలిసిందే. ఎల్లకాలం అమెరికా సాయంగా రాదని అన్నారు. తాము సాయం కోరినప్పుడు ఇతర దేశాలు రాలేదని కూడా మండిపడ్డారు.


ఈ వార్తలూ చదవండి:

యూఎస్ పరువు పోయే వరకూ యుద్ధం తప్పదు.. ట్రంప్‌నకు ఇరాన్ సైన్యం వార్నింగ్

ఎవరెస్ట్‌పై భారీ స్కామ్.. బేకింగ్ సోడాతో డ్రామా..

Updated Date - Apr 02 , 2026 | 08:04 PM