ప్రతీకారం తీర్చుకుని తీరుతాం: ఇరాన్ సుప్రీం లీడర్
ABN , Publish Date - Jul 11 , 2026 | 05:40 PM
తన తండ్రి, ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతొల్లా ఖమేనీ మృతిపై తప్పక ప్రతీకారం తీర్చుకుంటామని సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ ప్రతినబూనారు. ఈ మేరకు ఇరాన్ ప్రజలకు ఒక బహిరంగ సందేశాన్ని ఇచ్చారు.
ఇంటర్నెట్ డెస్క్: ఇరాన్ మాజీ సుప్రీం లీడర్, తన తండ్రి అయతొల్లా ఖమేనీ మృతికి కారణమైన వారిపై ప్రతీకారం తీర్చుకుంటానని దేశ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ ప్రతినబూనారు. ఇరాన్ ప్రజలు ప్రతీకారాన్ని కాంక్షిస్తున్నారని అన్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక సందేశాన్ని విడుదల చేశారు. తన తండ్రి ఖమేనీ రక్తం చిందడానికి కారణమైన వారిపై ప్రతీకారం తప్పదని అన్నారు. ఈ రెండు యుద్ధాల్లో అమరులైన ఇరాన్ ప్రజల తరఫున గట్టి బదులిస్తామని చెప్పారు.
అయతొల్లా ఖమేనీ అంత్యక్రియల్లో పెద్ద సంఖ్యలో పాల్గొన్న ప్రజలకు కూడా మొజ్తాబా కృతజ్ఞతలు తెలిపారు. శత్రువర్గం తునాతునకలయ్యే స్థాయిలో ప్రజలు తరలివచ్చారని చెప్పారు. ఇరాన్, ఇరాక్ ప్రజలు ఇంత పెద్ద సంఖ్యలో హాజరుకావడం చారిత్రాత్మకమని వ్యాఖ్యానించారు.
ఇటీవల గల్ఫ్లో చెలరేగిన ఉద్రిక్తతలు కాస్త తగ్గినట్టే కనిపిస్తున్నాయి. ఇరాన్తో శాంతి ఒప్పందం ముగిసిపోయిందన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాము ఇరాన్తో చర్చలకు సుముఖంగానే ఉన్నామని చెప్పారు. ఇప్పటికే ఇరాన్కు చెందిన ఒక బృందం అమెరికాతో చర్చలు కొనసాగించేందుకు శనివారం ఒమన్ కు వెళ్లింది. హోర్ముజ్లో ఆయిల్ ట్యాంకర్లపై దాడి పొరపాటున జరిగిందని ఇరాన్ బృందం ట్రంప్ సలహాదారులకు చెప్పినట్టు తెలుస్తోంది. చర్చలు ముందుకు సాగకుండా ఇరాన్లో కొందరు అతివాదులు ఈ దాడి చేశారని ఇరాన్ బృందం చెప్పినట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
ఈ వార్తలనూ చదవండి
టెహ్రాన్లో భారీ పేలుడు శబ్దం.. అసలు కారణం ఇదేనన్న ఇరాన్..
ఇరాన్పై వెయ్యి మిసైళ్లతో దాడి: డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్..