ఇరాన్ దాడులు.. దుబాయ్ ఎయిర్పోర్టులో విమాన సర్వీసులకు బ్రేక్
ABN , Publish Date - Mar 16 , 2026 | 09:58 AM
దుబాయ్ ఎయిర్పోర్టుకు సమీపంలోని ఇంధన ట్యాంకుపై సోమవారం ఇరాన్ డ్రోన్ దాడి జరగడంతో కలకలం రేగింది. ఎయిర్పోర్టులో విమాన సర్వీసులను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు.
ఇంటర్నెట్ డెస్క్: గల్ఫ్లోని పలు దేశాలపై ఇరాన్ దాడులు కొనసాగుతున్నాయి. సోమవారం దుబాయ్ ఎయిర్పోర్టుకు సమీపంలో ఇరాన్ డ్రోన్లతో దాడులు చేసింది. ఈ క్రమంలో ఇంధన ట్యాంకుకు మంటలు అంటుకుని భారీ ఎత్తున అగ్నికీలలు ఎగసిపడ్డాయి. దీంతో, దుబాయ్ ఎయిర్పోర్టు అధికారులు విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. దుబాయ్ ఎయిర్పోర్టుకు సమీపంలో ఈ దాడి జరిగినట్టు దుబాయ్ మీడియా కార్యాలయం ధ్రువీకరించింది. ఇంధన ట్యాంకుపై దాడి జరిగినట్టు వెల్లడించింది.
యూఏఈలోని పలు పోర్టుల నుంచి అమెరికా దాడులు చేస్తోందని ఇరాన్ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల ఖర్గ్ ద్వీపంపై దాడి కూడా యూఏఈ పోర్టులు, డాక్స్ నుంచే జరిగిందని ఆరోపించింది. ఈ నేపథ్యంలో యూఏఈ పోర్టుల్లోని సిబ్బంది, అధికారులను మొత్తం వెనక్కు పిలిపించుకోవాలని దుబాయ్ను కోరింది. ఈ నేపథ్యంలో తాజాగా దుబాయ్ ఎయిర్ పోర్టుకు సమీపంలో డ్రోన్ దాడి జరగడం కలకలానికి దారి తీసింది.
యుద్ధం మొదలైన నాటి నుంచీ ఇరాన్ గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలను టార్గెట్ చేస్తోంది. ఫలితంగా గల్ఫ్ దేశాలు ఇప్పటివరకూ సుమారు 2 వేలకు పైగా ఇరాన్ మిసైల్, డ్రోన్ దాడులను ఎదుర్కున్నట్టు అంతర్జాతీయ మీడియాలో వార్తలు వెలువడ్డాయి. ఇక దుబాయ్ ఎయిర్పోర్టు టార్గెట్గా ఇప్పటికే పలు డ్రోన్ దాడులు జరిగాయి.
ఇవి కూడా చదవండి:
‘డ్యాన్సింగ్ మిసైల్స్’తో ఇరాన్ దాడులు!
ఇదిగో.. నాకు ఐదు వేళ్లే ఉన్నాయ్! నెతన్యాహు కొత్త వీడియో