ఒక్కో నౌకకు.. ఒక్కో విద్యుత్ ప్లాంట్
ABN , Publish Date - Jul 23 , 2026 | 06:10 AM
హోర్ముజ్ జలసంధిలో ఒక్కో నౌకపై ఇరాన్ దాడి చేసిన ప్రతిసారీ.. ఇరాన్లో ఒక్కో విద్యుత్ ప్లాంటును, వంతెనలను, వాటికి సమీపంలో ఉన్నవాటిని ధ్వంసం చేస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్...
హోర్ముజ్లో నౌకలపై దాడి చేస్తే ఇరాన్ భారీగా మూల్యం చెల్లించుకోక తప్పదు.. వంతెనలు, రైల్వేస్టేషన్లను ధ్వంసం చేస్తాం: ట్రంప్
వాషింగ్టన్/దుబాయ్, జూలై 22: హోర్ముజ్ జలసంధిలో ఒక్కో నౌకపై ఇరాన్ దాడి చేసిన ప్రతిసారీ.. ఇరాన్లో ఒక్కో విద్యుత్ ప్లాంటును, వంతెనలను, వాటికి సమీపంలో ఉన్నవాటిని ధ్వంసం చేస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. ఇరాన్ భారీగా మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. ఇరాన్పై యుద్ధంపట్ల అమెరికా ప్రజల్లో మద్దతు తగ్గుతోందన్న వార్తలను ట్రంప్ తప్పుబట్టారు. మరోవైపు, ఇక ఈ నెల 17న జోర్డాన్లోని మువాఫక్ సల్టీ ఎయిర్బే్సపై ఇరాన్ చేసిన దాడికి సంబంధించి మరో అమెరికా సైనికుడు కూడా మృతిచెందినట్టు అమెరికా రక్షణశాఖ తాజాగా వెల్లడించింది. ఆ దాడిలో ఇప్పటికే ఇద్దరు సైనికులు మరణించారు. ఇరాన్పై తమ యుద్ధం ఖర్చు రూ.3,62 లక్షల కోట్లకు చేరినట్టు అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ తాజాగా వెల్లడించారు. గల్ఫ్లో బలగాల నిర్వహణ, యుద్ధం కోసం మరో రూ.8.45 లక్షల కోట్లు అవసరమని.. ఈ మేరకు నిధులను అనుమతించాలని అమెరికా చట్టసభ కాంగ్రె్సను కోరారు. అమెరికా, ఇరాన్ మధ్య బుధవారం కూడా పరస్పర దాడులు ఉధృతంగా కొనసాగాయి. అమెరికా దాడులకు ప్రతీకారంగా బుధవారం గల్ఫ్లోని అమెరికా స్థావరాలపై ఉధృతంగా దాడులు చేసినట్టు ఇరాన్ రెవెల్యూషనరీ గార్డ్స్ (ఐఆర్జీసీ) ప్రకటించింది. జోర్డాన్లోని మువాఫక్ సల్టీ ఎయిర్బేస్, ప్రిన్స్ హాసన్, కింగ్ ఫైసల్ స్థావరాలపై డ్రోన్లు, క్షిపణులతో దాడి చేసినట్టు తెలిపింది. ఈ దాడిలో పలు ఎఫ్-15 ఫైటర్లు, రెండు హెలికాప్టర్లు, ఎనిమిది ఎంక్యూ-9 డ్రోన్లు ధ్వంసమయ్యాయని.. మరికొన్ని తీవ్రంగా దెబ్బతిన్నాయని పేర్కొంది. ఇదిలా ఉండగా, ఎర్ర సముద్రం నుంచి అరేబియా సముద్రంలోకి ప్రవేశించే ‘బాబ్ అల్ మందేబ్’ జలసంధిలో హౌతీలు ఆంక్షలు పెట్టడంతో చమురు రవాణాపై మరింత ప్రభావం పడింది. చమురు ధర మళ్లీ పెరిగి బ్యారెల్కు 95 డాలర్లకు చేరింది.
సౌదీతో అమెరికా అణు ఒప్పందం
వాషింగ్టన్, జూలై 22: సౌదీ అరేబియాతో అణు ఒప్పందానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆమోదం తెలిపారు. ఈ ఒప్పందం ద్వారా పౌర అణు కార్యక్రమం కోసం సౌదీలోనే యురేనియం శుద్ధి చేయడానికి మార్గం సుగమమైంది. ఈ ఒప్పందం 30 ఏళ్ల పాటు అమలులో ఉండనుంది. దీనిపై ఇరు దేశాలు సంయుక్తంగా నిర్వహించే అధ్యయనం అనంతరం అమెరికన్ కంపెనీలు సౌదీలో అణుశుద్ధి కేంద్రాన్ని నిర్మించనున్నాయి. పశ్చిమాసియాలో అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయంలో ఈ ఒప్పందం కుదరడం గమనార్హం.
Also Read:
కౌంటీ ఛాంపియన్షిప్: యార్క్షైర్తో కుల్దీప్ యాదవ్ ఒప్పందం
గిద్దలూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి